హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీనివాస హైస్కూల్లో అగ్నిప్రమాదం
9, 10 తరగతుల విద్యార్థులను సురక్షితంగా బయటకు రప్పించిన సిబ్బంది, స్థానికులు
ఫర్నిచర్, పుస్తకాలు దగ్ధం
మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూల్లో గురువారం ఉదయం 10.45గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలను గమనించిన స్థానికులు ఆ పాఠశాల కరస్పాండెంట్ డి.శ్రీనివాసరెడ్డిని, ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. రెండవ అంతస్థులో 9వ, 10వ తరగతికి చెందిన సుమారు 23 మంది విద్యార్థులు ఉండగా స్థానిక యువకులు, ఉపాధ్యాయులు కలిసి పక్కన ఉన్న భవనాల మీదుగా వారిని క్షేమంగా కిందకు తీసుకువచ్చారు. మరోవైపు పాఠశాల సిబ్బంది, స్థానికులు కలిసి భవనం దిగువ ఉన్న కార్యాలయ గది తలుపులు, కిటికీలు తెరిచి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కార్యాలయంలోని ఫర్నీచర్, పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న గౌలిపురా మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర పలువురు ప్రమాద స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షార్ట్సర్కూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఛత్రినాక ఇన్స్పెక్టర్ ఎస్ఎ ఖాదర్ జిలానీ తెలిపారు.
Fire Accident in Govt School in Gowlipura