Saturday, May 4, 2024

దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో ఐజిబిసి ‘గ్రీన్’ ప్రాపర్టీ షో

- Advertisement -
- Advertisement -
ఈ నెల 28 ప్రారంభించనున్న మంత్రి కెటి. రామారావు

హైదరాబాద్ : దేశంలో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సిఐఐలో భాగమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ( ఐజిబిసి )మొట్టమొదటి ఐజిబిసి ‘గ్రీన్’ ప్రాపర్టీ షోను ఈ నెల 28,29,30 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ మాధాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సిఐఐ తెలంగాణ ఛైర్మన్ సి. శేఖర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని.. ఈ ఎక్స్‌పోలో వందలాది డెవలపర్లు తమ ప్రాజెక్టులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారని సిఐఐ తెలంగాణ ఛైర్మన్ సి. శేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు కో ఛైర్మన్ శ్రీనివాస మూర్తి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ఆనంద్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె టి రామారావు ఏప్రిల్ 3వ తేదీన తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించారని..ఆ సందర్భంగా అప్పట్లోనే ఈ గ్రీన్ ప్రాపర్టీ షో బ్రోచర్‌ను మంత్రి కెటి రామారావు, మంత్రి టి హరీష్ రావులు ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నానన్నారు. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనూ..తెలంగాణ ప్రభుత్వం హరితహారంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణంలోనూ  ‘గ్రీనరీ’ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అపార్ట్‌మెంట్ ఖాళీ స్థలం మొదలుకొని భవనాల పైఅంతస్తులపై కూడా పచ్చదనం పరిఢవిల్లేలా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఉండేలా చూస్తున్నామన్నారు.

మంత్రి కెటిఆర్ ఆదేశంతో సిద్దిపేటలో టిఎస్‌ఐఐసి ఇలాంటి భవనాన్ని నిర్మించిందని శేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో సాంప్రదాయ భవనాల కంటే ఐజిబిసి సర్టిఫైడ్ లేదా ప్రీ-సర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ద్వారా హరిత భవనాల నిర్మాణం కోసం ఈ ఎక్స్‌పోలో బిల్లర్డు, డెవలపర్లకు పలు సూచనలు చేస్తామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రత్యేక కార్యక్రమాల ద్వార గ్రీనరీ భవనాలపై అవగాహన కల్పిస్తామన్నారు.దేశంలోనే మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ గ్రీన్ ప్రాపర్టీ షోలో తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని శేఖర్ రెడ్డి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News