Monday, April 29, 2024

మరో ఐదుగురు అభ్యర్థులు ఖరారు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
సునీతామహేందర్‌రెడ్డి(మల్కాజిగిరి), మల్లు రవి (నాగర్‌కర్నూల్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), గడ్డం రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి)కు చోటు

దేశవ్యాప్తంగా 57 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు గురువారం రాత్రి ఎఐసిసి వి డుదల చేసింది. మొత్తం 57మంది అ భ్యర్థులను ఈ జాబితాలో చోటు దక్కిం ది. ఎఐసిసి విడుదల చేసిన ఈ జాబితా లో తెలంగాణకు చెందిన ఐదుగురు పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా స్థానాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ క ర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ జాబితా విడుదల చేశారు. మొదటి విడతలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండో విడతలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తుండడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశావహులు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే 8 మంది అభ్యర్థుల జాబితాను (కాంగ్రెస్ మూడో జాబితాను) హోలీ తర్వాతే ప్రకటించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండడంతో టికెట్‌లు ఆశిస్తున్న ఆశావహులు జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్లాష్ సర్వేల పేరుతో పలు దఫాలుగా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అధిష్ఠానం ఈ మేరకు గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా మూడో జాబితాను పెండింగ్‌లో ఉంచడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
భువనగిరి, ఖమ్మం మినహా మిగతాచోట్ల…
మొదటి జాబితాలో జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలకు, రెండో జాబితాలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించించిన కాంగ్రెస్ హైకమాండ్ మిగిలిన 8 స్థానాలపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇందులో భువనగిరి, ఖమ్మం మినహా మిగతాచోట్ల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే సోమవారం (ఈనెల 25వ తేదీన) సీఈసీ సమావేశం నిర్వహించి అదే రోజున లేదా ఆ మరుసటి రోజున మూడో జాబితాను వెల్లడించే అవకాశముందని సమాచారం. ఇక భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాశ్ నేత పోటీ పడుతుంటే, ఖమ్మం టికెట్ కోసం మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, మరోమంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి బిగ్ టాస్క్‌గా మారింది.
కాంగ్రెస్ వర్సెస్ బిజెపిల మధ్య పోటీ
కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వెనుక అభ్యర్థులపై ఆర్థిక భారం పడకూడదన్న ఆలోచన ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉంది. బిఆర్‌ఎస్ రోజురోజుకు బలహీనపడుతుండటంతో కాంగ్రెస్ వర్సెస్ బిజెపిల మధ్య పోటీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగా గెలుపే లక్ష్యంగా 8 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాధించగలిగే ప్రజా బలం కలిగిన నాయకులకే టికెట్లను ఇచ్చే దిశలో కాంగ్రెస్ అధి నాయకత్వం ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది.
56 మందితో 3 వ జాబితా
56 మంది అభ్యర్థులతో మూడో జాబితా గురువారం కాంగ్రెస్ విడుదల చేసింది. బెర్హంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరి,కర్ణాటక లోని గుల్బర్గా నుంచి మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ, సోలాపూర్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండేను రంగం లోకి దింపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News