అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప మాజీ ఎంఎల్ఎ కందుల శివానందరెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1981లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఎస్సిగా, 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ ఎంఎల్ఎగా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతూ కడప జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పని చేశారు. కడప, రాయలసీమ పేరిట స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. కందుల గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి విద్యారంగంలోనూ ఆయన రాణించారని ఆయన కుటుంబ సభ్యులు వివరించారు. అంతేకాకుండా కడపలో కందుల కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. గత కొంతకాలం నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో కందుల శివానందరెడ్డి సోదరుడు కందుల రాజమోహన్రెడ్డి భాజపాలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో పని చేస్తున్నారు. శివానందరెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.
Former MLA Kandula Sivananda Reddy passes away