హైదరాబాద్ : తల్లి నుంచి అధికారి వరకు ప్రతి పాత్రలో మహిళ ఒదిగిపోతుందని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఫోరం ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (WIPS) 30 వ జాతీయ సమావేశ వేడుకలను మంగళవారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు దేశ ఆర్థిక వృద్ధికి చోదకులుగా ఎదిగారని, జాతీయ అభివృద్ధి పెరగడంలో వారి ఆర్థిక సాధికారత చాలా అవసరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ఇ)లలో మహిళా ఉద్యోగులను శక్తివంతం చేయడంలో ఫోరం ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (విప్స్) పాత్రను ఆమె ప్రశంసించారు. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా ఒక పనిని చేయడంలో సానుకూల దృక్పథం పెంపొందించుకొని, మహిళలు తమ జీవితంలో సానుకూల వైఖరిని ప్రోత్సహించాలన్నారు. విద్య, నైపుణ్యం పెంపొందించకోవడం మహిళా సాధికారతకు పునాది అని ఆమె పేర్కొన్నారు.
అనేక సవాళ్లను అధిగమిస్తున్నారు
మహిళలు తమ దైనందిన జీవితంలో అనేక రకాల సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు వాటిని అధిగమిస్తు న్నారని, మహిళలకు అవకాశాలు కల్పించినప్పుడల్లా వారు దానిని బాగా ఉపయోగించుకుంటున్నారన్నారు. మహిళలు సులభంగా రూపాంతరం చెందుతారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న మహిళా ఉద్యోగులను గవర్నర్ ప్రశంసించారు. మానసిక, శారీరక ఆరోగ్యం అవసరాన్ని గవర్నర్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. శరీరాన్ని మంచి ఆకృతిలో కాపాడడమే కాకుండా, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, యోగను దైనందిన జీవితంలో భాగం చేయాలని ఆమె మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గవర్నర్ విప్స్ స్మారక చిహ్నాన్ని విడుదల చేసి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యుత్తమ పని తీరును కనబరచిన సంస్థలకు, మహిళా ఉద్యోగుల (ఎగ్జిక్యూటివ్స్ అండ్ నాన్-ఎగ్జిక్యూటివ్స్)కు అవార్డులను అందజేశారు.
జాతీయ సదస్సులో 700 మంది ప్రతినిధులు
స్కోప్ డైరెక్టర్ జనరల్ అతుల్ సోబ్టి తన ప్రసం గంలో పిఎస్ఈలలో పనిచేసే మహిళల సామర్థ్యాలను పెంచడానికి స్కోప్ తీసుకున్న వివిధ చర్యల గురించి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచవ్యాప్తంగా పరిపూర్ణత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ జాతీయ సదస్సులో భారతదేశం అంతటా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 700 మంది విప్స్ ప్రతినిధులు పాల్గొన్నారు . ‘పవర్ టు ట్రాన్స్ఫార్మ్ డెసిషన్ టు యాక్షన్’ అనే అంశంపై మంగళవారం చర్చ నిర్వహించారు. కీర్తి తివారీ, ప్రెసిడెంట్ అపెక్స్ విప్స్, సంచితా బెనర్జీ, ప్రెసిడెంట్ అపెక్స్ విప్స్, మల్లికా ఎస్ శెట్టి, వి.పి అపెక్స్ విప్స్, అపెక్స్ విప్స్ ప్రధాన కార్యదర్శి అంజు గుప్తా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.