ఐదున్నర కోట్ల మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ క్యాంటీన్లు
లాక్డౌన్లో 65లక్షల మందికి ఉచిత భోజనాలు
ఏ రాష్ట్రంలోనూ జరగని స్థాయిలో సంతర్పణ : కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: అన్నార్థుల ఆకలిమంటలు తీరుస్తున్న అన్నపూర్ణ క్యాంటిన్లు ఇప్పటివరకు ఐదున్నర కోట్లమందికి భోజనాలు వడ్డించిందని రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్లో పోస్టు చేశారు. అన్నపూర్ణ క్యాంటిన్లను సందర్శించిన ఫోటోలను కూడా ఆయన పోస్టు చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆరు సంవత్సరాల క్రితం అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభమైన అన్నపూర ్ణక్యాంటిన్లు అనాథలు, నిరుపేదలు, ఆకలితో అలమటించేవారు, పర్యాటకులు, వలసకూలీలకు రూ.5 కే భోజనం అందించి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు.
అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా నిరుపేదలు, కార్మికులు, వలస కార్మికులకు అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా ఉచిత భోజనాలు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటివరకు 65 లక్షల మందికి ఉచితంగా భోజనాలు ఏర్పాటుచేసినట్లు కెటిఆర్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా నేపథ్యంలో 65 లక్షల మందికి ఉచిత భోజనాలు సమకూర్చలేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉచిత భోజనాల వితరణలో భాగస్వామి అయిన అక్షయపాత్ర, జిహెచ్ఎంసిలను ఆయన అభినందించారు.