దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల గడువు
వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సిఎస్ను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వరంగల్ కార్పోరేషన్లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల
పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడంపై ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.