హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయమంత్రి కిరెణ్ రిజిజుకు విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులకు శిక్షణ ప్రొత్సాహం అందిస్తే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించవచ్చని తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో కిరెణ్ రిజిజును కలిసిన ఎంపి సంజయ్.. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమాల పట్ల యువతలో విశేష స్పందన కనిపిస్తోందని అన్నారు. ఖేలో ఇండియా సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అభివృద్ధి కోసం గుర్తించిన ౩ ఖేలో ఇండియా సెంటర్లలో ఒకటి.. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల కేటాయింపు ద్వారా.. క్రీడాభివృద్ధి, మరిన్ని కొత్త క్రీడల్లో శిక్షణ అందించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఎంపి బండి సంజయ్కుమార్ విజ్ఞప్తికి కిరెణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని అన్నారు.