న్యూఢిల్లీ: కష్ట కాలంలో ఉండే వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే భారత మాజీ క్రికెటర్, లోక్సభ సభ్యుడు గౌతం గంభీర్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటాడు. తన ఇంటిలో పని మనిషిగా పనిచేస్తున్న సరస్వతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. సరస్వతి సొంత రాష్ట్రం ఒడిశా కావడంతో లాక్డౌన్ వల్ల మృత దేహాన్ని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గంభీర్ తానే సరస్వతి అంత్యక్రియలను జరిపేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సరస్వతి కుటుంబ సభ్యులకు తెలిపి వారి అంగీకారంతో తానే స్వయంగా ఆమె అంత్యక్రియాలు జరిపాడు.
ఈ విషయాన్ని గంభీర్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సరస్వతి కొంతకాలంగా మధు మేహం, అధిక రక్తపోటుతో బాధపడుతోందని, కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చేర్చి చికిత్స జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సరస్వతి తన సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నానని, ఆమె మరణం తనను ఎంతో కలచి వేసిందని పేర్కొన్నాడు. ఇదిలావుండగా పని మనిషి అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటిన గంభీర్పై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు, సహచర క్రికెటర్లు గంభీర్ చేసిన మంచి పనిని కొనియాడారు.