దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్కు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐపిఎల్ను కోట్లాది మంది టివిల్లో వీక్షిస్తున్నారని, గతంతో పోల్చితే ఈసారి ఆదరణ మరింత పెరగడం ఆనందం కలిగిస్తుందన్నాడు. ఒక దశలో ఐపిఎల్ జరుగుతుందా లేదా అనేది తనకు సందేహంగా ఉండేదన్నాడు. కరోనా విలయతాండవాన్ని చూసి ఈ సీజన్లో ఐపిఎల్పై ఆశలు వదులుకున్నానని తెలిపాడు. అయితే ఫ్రాంచైజీలు ధైర్యంతో ముందుకు రావడంతో యుఎఇ వేదికగా ఐపిఎల్ను నిర్వహించేందుకు బోర్డు ముందుకు వచ్చిందన్నాడు. ఇక మైదానాల్లో అభిమానులకు ప్రవేశం లేకున్నా టివిల్లో క్రికెట్ ప్రేమీకులు ఐపిఎల్ను ఆస్వాదించారన్నాడు. అంతేగాక దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడంతో అభిమానుల ఆదరణ మరింత పెరిగిందన్నాడు. క్లిష్ట సమయంలో నిర్వహించిన మెగా టోర్నీ విజయవంతం కావడం ఎంతో ఆనందం కలిగించిందని గంగూలీ వ్యాఖ్యానించాడు.
Ganguly Surprised on Ginormous Success of IPL 2020