న్యూఢిల్లీ : ఆలయ భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని వివరించింది. దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించే హక్కులు ఉన్నంత మాత్రాన వారు భూస్వాములు కాలేరని పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆలయాల ఆస్తులను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య చర్యలు చేపట్టింది.
ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించాలంటూ రెండు సర్కులర్లు జారీ చేసింది. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా, ఈ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆలయ భూములకు దేవుడే యజమాని అని స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డులో పూజారి లేదా మేనేజర్ పేరు కానీ చేర్చాలని ఎలాంటి తీర్పుల్లో తాము గమనించలేదని అలాగే మేనేజర్గా కలెక్టర్ పేరును చేర్చరాదని స్పష్టం చేసింది.