హైదరాబాద్ : రక్షాబంధన్(రాఖీపండగ) సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్ ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లకు ఉన్న బంధం ఎంతో పవిత్రమైందని ఆమె పేర్కొన్నారు. సోదర బంధం మరింత బలంగా ఉండేందుకు చెల్లెళ్లు అన్నయ్యలకు రాఖీలు కడతారని, సోదరులు ఎంతో అభిమానంతో చెల్లెళ్లను ఆశీర్వదించడం అనవాయితీగా వస్తోందన్నారు. ప్రధాన మంత్రి ఇచ్చిన బేటీబచావో, బేటీ పడావో పిలుపు స్ఫూర్తితో ఈసారి రక్షాబంధన్ను మరంత ఘనంగా జరుపుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. సోదరీమణులకు అన్నయ్యలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పడమే ఈ పండగ ప్రాముఖ్యతని గవర్నర్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తల మధ్య ఇంట్లోనే ఈ పండగను జరుపుకోవాలని ఆమె సూచించారు.
Governor tamilisai Wishes People On Raksha Bandhan