Monday, April 29, 2024

ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో దేవాదాయ శాఖ సౌజన్యంతో దేవస్థాన ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, విశిష్ట అతిథిగా జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో సుదర్శన యాగం చేపట్టినట్లు తెలిపారు.

యజ్ఞయాగాలు, హోమాలు లోక కల్యాణం కోసం చేస్తుంటామని ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు, పాడి పంటతో సుబీక్షంగా ఉండాలని కోరుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధ్దరించి ఆధునీకరించినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో మన బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి దేవాలయాన్ని ప్రపంచ స్థాయిలో నిర్మించడం జరిగిందన్నారు.

అర్చకులు, పూజారులకు రూ. 1400 ఉన్న దూప దీప నైవేద్యాలను రూ. 6422కు పెంచడం జరిగిందన్నారు. దూప దీప నైవేద్యాలు మంజూరైన దేవాలయాల అర్చకులకు రూ. 6000 ఉన్న నెల జీతం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూ. 10 వేలకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లక్ష్మీ ప్రసన్న, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు రంగు రమేశ్‌గౌడ్, రంగు హరీష్‌గౌడ్, వేల్పుల గట్టయ్య, చల్లారపు శ్యాంసుందర్, దేవస్థాన పూజలు సౌమిత్రి రంగాచర్యులు, రవీంద్రశర్మ, అరుణ్‌స్వామి, శ్రీనివాసచార్యులు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, భక్తులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News