Friday, May 3, 2024

ఛీత్కారాలు, పురస్కారాల మహాకవి

- Advertisement -
- Advertisement -

మహాకవి గుర్రం జాషువా (జులై 24) వర్ధంతి సందర్భంగా ఆయన రచనలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మహాకవి గుర్రం జాషువా జీవితాన్ని పరిశీలిస్తే ఆద్యంతం అవమానాలను ఎదిరించి నిలిచి గెలిచిన సాక్ష్యాలే కనిపిస్తాయి. ఆయన అసమాన ప్రతిభతో సాహిత్య శిఖరాన్ని అధిరోహించారు. సాంఘిక దురాచాలను తన రచనల ద్వారా చీల్చి చెండాడారు. ఆధునిక తెలుగు కవులలో సుప్రసిద్ధ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971).

సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు జాషువా. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి పాస్టర్‌గా పని చేసేవాడు. ఈ ఒక్క విషయం చాలు మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి.

ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవారు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే తిరగబడి వాళ్ళను కొట్టారు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నారు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పని చేసారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూపోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశారు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పని చేశారు. 1957- 59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పని చేశారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించారు. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవారు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది.

జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసారు. వాటిలో ప్రముఖమైనవి గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచి వేస్తుంది. 1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహా కావ్యాన్ని రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించారు. 1948 లో రాసిన బాపూజీ – మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి. సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా 1919 – రుక్మిణీ కళ్యాణం, 1922 -చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం, 1924 – కోకిల, 1925 -ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం, 1926 – శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారత మాత, 1927 – భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు, 1928 – రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు, 1929 – సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం, 1930 – దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ, 1931 భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యం, సందేహ డోల, 1932 – స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం. 1933 – అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక, 1934 – ఆంధ్ర భోజుడు, 1941 – గబ్బిలము, 1945 – కాందిశీకుడు, 1946 – తెరచాటు, 1948 – చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ, 1950 – స్వయంవరం 1957 – కొత్తలోకం, 1958 – క్రీస్తు చరిత్ర, 1963 – రాష్ట్ర పూజ, ముసాఫిరులు, 1966 – నాగార్జునసాగరం, నా కథ, జాషువా తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు.

తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్‌గా ప్రసిద్ధుడయ్యారు. 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందజేసింది. జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది.

2002 లో ఏడవ సంచికగా అస్సామీ కవి నిల్మనీ ఫుఖాన్‌కు పురస్కారమివ్వబడిరది. తెలుగు అకాడమీ, జాషువా పరిశోధనా కేంద్రం 2012 సెప్టెంబరు 28న ‘జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా’న్ని (రెండు లక్షల నగదు పురస్కారం ) ప్రముఖ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌కి బహూకరించారు. 2013 సెప్టెంబరు 28 న తెలుగు అకాడమీ జాషువా పురస్కారాల సమావేశం తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనాకేంద్రం కవులకు రచయితలకు మూడు పురస్కారాలు 2013 సెప్టెంబరు 28 న (118 వ జన్మతిథి రోజున) అందజేసింది. ఈ పురస్కారం 2 లక్షల రూపాయల నగదు, శాలువా, ప్రశంసా పత్రంతో కూడుకున్నది. దాశరథి రంగాచార్యకు జాషువా జీవిత సాఫల్య పురస్కారము, కొలకలూరి స్వరూప రాణికి జాషువా విశిష్ట మహిళా పురస్కారం బహుకరించారు. దళిత సాహిత్యంలో విశేష కృషి చేసినందులకు కాలువ మల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారం బహుకరించారు. అందుకే గుర్రం జాషువా పేరు తెలుగు భాష, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం సాహిత్య శిఖరమై వెలుగొందుతూనే ఉంటుంది.

-వనం నాగయ్య ,  9441877695

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News