తన ఆత్మకథలో గుర్తు చేసుకున్న ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీమూన్
న్యూఢిల్లీ: తన హృదయంలో సగం భారత్తో పెనవేసుకున్నదని ఐక్యరాజ్యసమితి(ఐరాస) మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీమూన్ తన ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బాన్కీమూన్ దౌత్యవేత్తగా తన మొదటి పోస్టింగ్ను భారత్లోనే ప్రారంభించారు. భారత్లో ఉన్న ఆ మూడేళ్లు తనకు అద్భుతంగా గడిచాయని తెలిపారు. తన ఆత్మకథ ‘రిసాల్వ్డ్:యునైటింగ్ నేషన్స్ ఇన్ డివైడెడ్ వరల్డ్’లో బాన్ 50 ఏళ్లనాటి తన గతాన్ని తెలియజేశారు. ఐరాస ఏర్పాటుకు ఓ ఏడాది ముందు 1944లో బాన్కీమూన్ జన్మించారు. ఆయన బాల్యం ఉభయ కొరియాల యుద్ధం మధ్య గడిచింది. తన గ్రామంపైనా బాంబులు పడిన ఘటనలు ఆయన స్మృతిపథంలోంచి తొలగిపోలేదు.
తన కుటుంబం సురక్షిత ప్రాంతంవైపు తరలివెళ్లే సమయంలో బాన్ ఆరేళ్లబాలుడు. బురదనీటిలో నడుస్తూ, ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ బతుకుజీవుడా అంటూ భయకంపిత వాతావరణం మధ్య గడిచిన రోజులు ఆయణ్ని ఆ తర్వాత ఓ శాంతిదూతగా మార్చాయి. 1972, అక్టోబర్లో కుటుంబంతో ఢిల్లీకి చేరుకున్న బాన్ మూడేళ్లపాటు వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా పని చేశారు. తన కూతురు సియోన్యాంగ్కు అప్పుడు 8 నెలలని ఆయన తెలిపారు. తన కుమారుడు వూహ్యున్ 1974, అక్టోబర్ 30న ఇక్కడే జన్మించారని గుర్తు చేశారు. తన మరో కూతురు హ్యూన్హీ ఓ భారతీయుడిని పెళ్లాడారని ఆయన తెలిపారు.