Friday, May 3, 2024

వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం జిల్లాలోని శ్రీ కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. అంతకుముందు మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”కొమురవెళ్లి మల్లన్న దివ్య క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు. మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నకు బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు.

Harish Rao Visit Komuravelli Mallikarjuna Swamy Temple

ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు కల్పతరువుగా మారింది. మొక్కు తీర్చుకొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. దేవాలయ ఆవరణలోని గుట్టపై 100 గదులతో సత్రాలు త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నాం. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాకర్, ఇతర దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్లాస్టిక్ రహిత దేవాలయంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యేడు ఇంకా కాలం కాకున్నా మల్లన్న దేవుడి ఆశీస్సులతో వర్షం కోసం ఎదురు చూపులు చూడకుండా కాళేశ్వరం ద్వారా వచ్చే జలాలు ఉన్నాయని.. రైతులు ధైర్యంగా, నమ్మకంతో నారు పోశారు” మంత్రి చెప్పారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News