Saturday, May 4, 2024

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

Harsh Vardhan appreciates covid control measures

 

తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
తెలంగాణలో బెడ్లను 18,232 నుంచి 53,775కి పెంచాం
సిఎం కెసిఆర్ ఆదేశాలతో డోర్ టు డోర్ కొవిడ్ ఫీవర్ సర్వేను నిర్వహించి
అనుమానితులకు ఉచితంగా హెల్త్ కిట్లు అందజేస్తున్నాం
తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా రోగుల వల్ల రద్దీ పెరిగింది
రాష్ట్ర జనాభా ప్రాతిపదిక కాకుండా పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా
మందులు, ఆక్సీజన్, ఇతరాల కేటాయింపులు జరపాలి
రాష్ట్రానికి మరింతగా అన్ని రకాల కోటాను పెంచాలి
ఆక్సీజన్‌ను 600 మెట్రిక్ టన్నులకు పెంచి
ఎపి,మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కేటాయింపులు చేయాలి
రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు, 2 వేల వెంటిలేటర్లు తక్షణమే సరఫరా చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ విజ్ఙప్తి
తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్జప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
రాష్ట్ర అవసరాలరీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు చేపడుతామని హామీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం సెక్రటరీ, కొవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఇ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్‌లు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కట్టడి చేయడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో బెడ్లు మూడు రెట్లు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సీన్లు, ఆక్సీజన్ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్సులో మాట్లాడుతూ, మొదటి వేవ్ కరోనా సందర్భంలో వున్న మౌలిక వసతులను రెండవ వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని వివరించారు. నాడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే ఉంటే నేడు వాటి సంఖ్య 53,775కి అంటే మూడు రెట్లు పెరిగిందని అన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో 9,213గా వున్న ఆక్సీజన్ బెడ్లను 20,738కి, ఐసియు బెడ్లను 3,264 నుంచి 11,274కు ప్రభుత్వం పెంచిందని తెలిపారు. ఉన్న వాటికంటే మూడు రెట్లకు పెంచామని చెప్పారు.

డోర్ టు డోర్ కొవిడ్ ఫీవర్ సర్వే
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నదని వివరించారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎం సిబ్బందితో కూడిన 27,039 టీంలు ఇంటింటికి వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి, కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే అడ్డుకోవడం, తద్వారా దవాఖానాలో చేరే పరిస్థితి నుంచి, మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్టవుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇండ్లల్లో కొవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్‌లో వుంచి వారికి హెల్త్ కిట్లు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్ డౌన్ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్రం తరఫున కేంద్రమంత్రికి మంత్రి హరీష్ రావు పలు విజ్జప్తులను చేశారు.

ఇతర రాష్ట్రాల కరోనా రోగుల వల్ల రద్దీ పెరిగింది..అన్ని రకాల కోటాను పెంచాలి
తెలంగాణ మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో తెలంగాణలోని స్థానిక కరోనా రోగులకు అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందని అన్నారు. తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్‌మెంటు పొందుతున్నారని తెలిపారు. వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా లెక్కింప బడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తున్నదని వివరించారు.

ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు, ఆక్సీజన్, ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరింతగా, అన్ని రకాల కోటాను పెంచాల్సి వున్నదని కోరారు. ఆక్సీజన్ సరఫరా పెంచాలని, రెమిడిసివర్ ఇంజక్షన్ల కోటాను, వాక్సీన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని కోరారు.

సమీప రాష్ట్రాల నుంచి ఆక్సీజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలి
తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్‌ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని అన్నారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గరలో వున్న రాష్ట్రాల నుంచి ఆక్సీజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలని కోరారు. తద్వారా తరలింపుకు సులువవుతుందని వివరించారు. పక్కన వున్న ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కేటాయింపులు చేయాలని అన్నారు.

ఇప్పటికే సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రితో మాట్లాడివున్నందున రెమిడిసివర్ ఇంజిక్షన్లను రోజుకు 20 వేలకు పెంచాలని కేంద్ర మంత్రిని మరోమారు మంత్రి హరీష్ రావు కోరారు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్స కోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని, టోసిలీ జుమాబ్ మందులను కేవలం 810 మాత్రమే కేటాయించారని, వాటిని 1,500కు పెంచాలని అన్నారు. ప్రతిరోజు తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమున్న పరిస్తితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలని కోరారు.

నెలాఖరు నాటికి 13 లక్షల వ్యాక్సీన్లు రాష్ట్రానికి సరఫరా చేయాలి
రెండో డోస్ కొవిడ్ టీకానును సిఎం ఆదేశాల మేరకు నూటికి నూరు శాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కోసం 96 లక్షల వాక్సిన్లు, సెకండ్ డోస్ పూర్తి చేయడం కోసం 33 లక్షల వ్యాక్సీన్లు మొత్తం 1 కోటీ 29 లక్షల వ్యాక్సీన్ల అవసరం వున్నదని చెప్పారు. ఈనెల చివరి వరకు గాను 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సీన్లు, 3 లక్షల కోవాక్సిన్ వ్యాక్సీన్లు మొత్తం 13 లక్షల వ్యాక్సీన్లు తక్షణావసరం ఉన్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. 2 వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరమున్న నేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్జప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్దన్ వివరాలన్నీ నోట్ చేసుకున్నామని, తప్పకుండా రాష్ట్ర అవసరాలరీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

Harsh Vardhan appreciates covid control measures on telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News