టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులపై పందేలు n సర్వే రిపోర్టుల ఆధారంగా సాగుతున్న వైనం n కాంగ్రెస్ పార్టీపై కట్టేవారు కరువు
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉపపోరు ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్, బిజెపి పార్టీలపై భారీగా బెట్టింగ్లు మొదలయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఈక్రమంలో సర్వేలలో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బెట్టింగ్ కట్టేవారు కరవుయ్యారు. నేపథ్యంలో దుబ్బాక ఉపపోరు ఎన్నికలపై కోట్లాది రూపాయల్లో పెందేలు సాగుతున్నట్లు సమాచారం. దుబ్బాక ఎన్నికలలో అభ్యర్థుల విజయాలపైనే కాకుండా మెజారిటీలపైనా బెట్టింగ్లు సాగుతుండటం గమనార్హం. ఇందులో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థికి ఇంత మెజారిటీ వస్తుందని, ప్రత్యర్థి అభ్యర్థికి ఇన్ని మాత్రమే వస్తాయని జోరుగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.
ఓటు ఓటుకు పందెంతో పాటు రౌండ్ రౌండ్కు పందెం, మెజారిటీలపై బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలియవచ్చింది. అదేవిధంగా ఫలాన పార్టీకి ఇన్ని ఓట్లొస్తాయని, కాదు ఇన్నే వస్తాయని బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాగా అత్యధికంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందని ఎక్కువగా పందేలు నడుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపు, ఓటములపైనే కాకుండా జూదరులు మెజారీటిపైనా అధిక మొత్తంలో పందేలు కాస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందన్న అంశాలతో పాటు అభ్యర్థికి లభించే మెజారిటీలపై మరికొందరు బెట్టింగ్లకు దిగుతున్నారు.
రాజకీయ బుకీల కోడ్
దుబ్బాక ఎన్నికలలో బెట్టింగ్ మాఫియా ‘ఫేవరెట్’ పేరిట పెందేలా కాస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులపై పెందెం కాసేందుకు ఫలానా అభ్యర్థి మా ఫేవరెట్ అని చెబితే చాలు పెందెం కాసినట్టే. మరొకరు ప్రత్యర్థి అభ్యర్థి మా ఫేవరెట్ అని సంకేతాలిస్తారు. ఇవన్నీ ఫోన్లలోనే జరిగిపోతున్నాయి. ఈక్రమంలో బెట్టింగ్లకు పాల్పడే వారు ముందుగా వారికి నమ్మకమైన వ్యక్తుల( రాజకీయ బూకీలకు)కు భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తున్నారు. దుబ్బాక ఫలితాలపై పందె కాసేవారి పేర్లను ప్రకటిస్తారు. ఫలాన పార్టీ అభ్యర్థికి ఇంత మెజారిటీ వస్తుందని కొంత మొత్తాలను బెట్టింగ్ కాస్తారు. అలాగే ప్రత్యర్థి పార్టీకి ఇన్ని రావచ్చని బెట్టింగ్ పెడతారు. ఇదిలావుండగా రాజకీయ బూకీలు తమ నెట్ వర్క్ ద్వారా నగదు వసూళ్లు చేస్తున్నారు. రాజకీయ బుకీలు నేరుగా పందె రాయుళ్లతో సంబంధాలు పెట్టుకోకుండా కమీషన్ పద్దతిలో కొందరిని నియమించుకున్నట్లు సమాచారం.
బడా బూకీల వద్ద ఏజెంట్లుగా పనిచేసేవారికి 5 శాతం నుంచి 8 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ బూకీలు దుబ్బాక ఎన్నికల ఫలితాలపై నిర్వహించే బెట్టింగ్లకు ఆన్లైన్ను ఉపయోగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గెలుపు, ఓటములు, అభ్యర్థి సాధించే ఓట్లపై పెందేలా కాసేవారిని ఆన్లైన్ ఆకర్షిస్తున్నట్లు సమాచారం. వారికి చెల్లించే మొత్తాలను సైతం పేటిఎం, అకౌంట్ టు అకౌంట్ , గూగుల్పే, తేజ్, మై మనీ, బీం, మనీపే తదితర సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో బెట్టింగ్ రాయుళ్లకు నేరుగా నగదు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా నగదు తరలింపులో ఉన్న సాంకేతికను వాడుకుంటూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు.