Monday, April 29, 2024

ఢిల్లీలో బుల్డోజర్

- Advertisement -
- Advertisement -

High tension in Jahangirpuri

సుప్రీంకోర్టు వద్దని చెప్పినా
ఆగని కూల్చివేతలు

కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ
శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే
ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు

న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన బుల్డోజర్ ట్రీట్‌మెంట్ రాజకీయం బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పురిప్రాంతంలో అక్రమ కట్టడాల పేరిట ఢిల్లీ మున్సిల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతలు ఈ ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అయితే సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేతలు నిలిచిపోయాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి తమకు అందలేదన్న సాకుతో అధికారులుబుధవారం దాదాపు రెండు గంటల పాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎక్కడయితే హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో అదే ప్రాంతంలో అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేత పనులు మొదలు పెట్టారు. భద్రతకోసం సుమారు 400 మంది పోలీసులను వెంటబెట్టుకొని తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ కట్టడాలంటూ వరసపెట్టి కూల్చివేసుకుంటూ వెళ్లారు.ఈ క్రమంలో పలు తోపుడు బండ్లు, దుకాణాల్లో భాగాలు ధ్వంసమైనాయి. ఈ క్రమంలో పిటిషనర్ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

యుపి, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపి ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిఫన్ దాఖలు చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషన్ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ తమకింకా కోర్టు ఉత్తర్వులు అందలేదని చెబుతూ అధికారులు తమపని తాము చేసుకుంటూ ముందుకెళ్లారు. అలా ఓ మసీదు గోడను, గేటును కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సిపిఎం నాయకురాలు బృందాకారత్ కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బుల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓ వీడియో సైతం బయటికి వచ్చింది.

సిజె జోక్యం

అదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేతలు ఆగలేదనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఢిల్లీ మున్సిపల్ అధికారులకు అందలేదని, దయచేసి ఈ విషయాన్ని వాళ్లకు తెలియజేయాలని పిటిషనర్ జమైత్ ఉలామాఇ హింద్ తరఫు సీనియర్ నాయయవాది దుశ్యంత్ దవే చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణను కోరారు. అంతేకాదు, మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైంది కాదని, ఆలస్యమయితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా కానీ, సుప్రీంకోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారా కానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ సూచించారు. న్యాయవాది దవేనుంచి సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు తీసుకుని సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బదిని ఆదేశించారు. అలా దాదాపు రెండు గంటల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు జహంగీర్ పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్‌కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు గురువారం వాదనలు విననుంది.

మండిపడిన విపక్షాలు

కాగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న బుల్డోజర్ రాజకీయాలపై ప్రతిపక్షాల మండిపడుతున్నాయి. నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆర్‌జెడి నేత జయంతి చౌదరి అన్నారు. బిజెపి గుర్తుపై బుల్డోజర్లు నడపాలని, బిజెపి అక్రమ అధికారానికి సింబల్ బుల్డోజర్ అని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలే వాళ్ల టార్గెట్ అని, వాళ్ల హిస్టీరియాకు ఇప్పుడు హిందువులు కూడా బాధితులుగా మారారని అఖిలేష్ అన్నారు.

ఇది రాజ్యాంగ విలువల కూల్చివేతే: రాహుల్

కాగా, ఢిల్లీలో అల్లర్లు జరిగిన జహంగీర్‌పురి , మధ్యప్రదేశ్‌లలో బుల్‌డోజర్లను ఉపయోగించడంపై మోడీ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇది రాజ్యాంగ విలువలను కూల్చివేయడమేనని, పేదలు, మైనారిటీలను టార్గెట్ చేయడమేనని అన్నారు. విద్వేషపూరిత బుల్డోజర్లను స్విచాఫ్ చేసి బొగ్గు కొరత కారణంగా మూతపడుతున్న విద్యుత్ ప్లాంట్లను స్విచాన్ చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

అమిత్‌షాతో ఢిల్లీ బిజెపి నేతల భేటీ

జహంగీర్‌పురి అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రీంకోర్టుస్టే ఇవ్వడంతో పలువురు ఢిల్లీ బిజెపి నేతలు కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు వీరు సమావేశమయ్యారు. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఎంపి రమేశ్ బిదూరి, ఎంఎల్‌ఎ రాంబీర్ బిదూరి, పార్టీ నేత మణిందర్‌సింగ్ సిర్సా సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశం వివరాలను మాత్రం నేతలు వెల్లడించలేదు. రొటీన్‌గానే తాము సమావేశమయినట్లు చెప్పారు. జహంగీర్‌పురిలో ఆక్రమణలను తొలగించాలంటూ ఆదేశ్ గుప్త్తా నార్త్ ఢిల్లీ మున్సిల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News