Friday, May 3, 2024

స్త్రీలను కించపరిచిన పాఠ్యగ్రంథాలు

- Advertisement -
- Advertisement -

మధ్య భారతంలోని చత్తీస్‌గఢ్‌లో హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో ‘దేశంలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం మహిళలు’ అని వుంది. మహిళలు అన్ని రంగాల్లో విజృంభించడం వల్ల అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతూ వుండడం వల్ల పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని ప్రభుత్వం వారు నిర్ధారించారు. స్త్రీ, పురుషులందరూ దేశ పౌరులయినప్పుడు పౌరులకు సమాన హక్కులున్నప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పని చేయాలి. ఉద్యోగావకాశాలు కల్పించాలి. అంతేగాని మహిళలు చదువుకొని ఉద్యోగాలకు పోటీ పడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అసంబద్ధంగా వుంది. స్త్రీలని గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతిమాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది?

వరుసగా జరిగిన మానవ వాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనా పరులైన రచయితలపై ఒత్తిళ్ళు, నోట్ల రద్దు, జిఎస్‌టి, బ్యాంకుల దివాలా, రైతుల లాంగ్ మార్చ్ వంటివన్నీ భవిష్యత్తు చీకటిగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అందుకు కారణం కేంద్ర మంత్రుల ఉపన్యాసాలు ఒక కారణమైతే, వివిధ రాష్ట్రాలలో పాఠ్యపుస్తకాలలోని అంశాలు మరొక కారణం! దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా చోటు చేసుకున్నాయో గమనించండి. పదమూడు పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలకు తప్పుడు సమాచారం అందించడమంటే, వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా? గుజరాత్‌లో యాభై వేల మంది చదువుకునే ఒక సామాన్య శాస్త్ర పాఠ్య గ్రంథంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్, అమెరికాపై అణు యుద్ధం ప్రకటించిందని వుంది. వక్రీకరించిన చారిత్రక అంశాలు చదువుకొని భావి భారత పౌరులు ఎలా తయారవుతారన్నది ఆందోళన పడాల్సిన విషయం.

అదే విధంగా స్త్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్యగ్రంథాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏమిటి? రాజస్తాన్‌లో బోధిస్తున్న ఒక పాఠ్యగ్రంథంలో స్త్రీలకు గాడిదలకు పోలిక చూపబడింది. ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీలు గాడిదల్లా చాకిరి చేయాల్సి వుంటుందని హిందీ పాఠ్య పుస్తకంలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టు కింద కాసేపు విశ్రాంతి నివ్వొచ్చు. కాని స్త్రీలకు ఇవ్వకూడదు ‘పాపం గాడిదలు పారిపోయినా వెంటనే మళ్ళీ దొరుకుతాయి. వాటికి స్త్రీలవలె పుట్టింటికి పారిపోయే సౌకర్యం లేదు’ అని ఆ పాఠం రాసిన రచయిత ఓ చమక్కు విసిరాడు. ఆ విషయాన్ని కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల దాకా అందరూ ఆమోదించారు. కాస్త సున్నిత మనస్కులు, ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు ఎవరైనా వుంటే ఆ పాఠం పిల్లలకు ఎలా చెపుతారూ? మనసు చంపుకొని ఉద్యోగ ధర్మంగా, పాఠం చెప్పడమంత శిక్ష మరొకటి వుండదు కదా? ‘పిల్లల పాఠంలో అలాంటి అంశం ఎందుకుందని’ ఒక జాతీయ పత్రికా విలేకరి సంబంధిత అధికారిని అడిగితే “ఏదో పిల్లలకు కాస్త సరదాగా వుంటుందని అలా పెట్టి వుంటారని అదో పెద్ద విషయమా?” అని ఎదురు ప్రశ్నించాడు. “భార్యలు గాడిదల్లాంటి వారు” అన్న వాక్యంలో అతనికి ఏ తప్పూ కనిపించలేదు. బిజెపి ప్రభుత్వాలున్న గుజరాత్, రాజస్తాన్‌లలో అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అలాగే కేంద్ర ప్రభుత్వం వారికీ ఎవరికీ అందులో తప్పే కనిపించలేదు. వీళ్ళంతా ఆధునిక మనువాద ప్రతినిధులన్న మాట!

సెంట్రల్ బోర్డు ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) పాఠ్య పుస్తకంలో పది, పదకొండేళ్ళ పిల్లలు చదువుకొనే పుస్తకంలో మాంసాహారం తినే వారి వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని వుంది. మాంసాహారం తీసుకునే వారు అవలీలగా అబద్ధాలు చెపుతారని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోరని, అల్లర్లు, అలజడులూ సృష్టిస్తారని, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడుతారని, వారికి నిజాయితీ నిబద్ధత వుండవని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడుతారని వుంది. ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి పసి మనసుల్ని ప్రభావం చేయడం ఏం సబబు? ఏ ఆహారం తీసుకుంటే ఏఏ లాభాలున్నాయి? ఎందులో ఎన్ని నష్టాలున్నాయి? అనేది శాస్త్రీయంగా వివరించాలి? ఆహారం ఎంచుకునే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి.

అంతేగాని, నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ గుది గుచ్చి మాంసాహారులకు ఆపాదిస్తే, అది నిజమైపోదు కదా? ఒక రకంగా చూస్తే మాంసాహారులు శాఖా హారులు ప్రపంచంలో సమానంగా వుండి వుంటారు లేదా మాంసాహారుల సంఖ్యే ఎక్కువగా వుండి వుంటుంది. అట్లని శాఖాహారులంతా సచ్ఛీలురు, సత్యవ్రతులు, సత్ప్రవర్తన గల మహనీయులు కాదు గదా? ఈ విషయమే సిబిఎస్‌ఇ డైరెక్టర్‌ని అడిగితే ‘పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో విషయాలు ఒక్కో రకంగా వున్నాయని ఒప్పుకొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయిపోయినా బాలబాలికలకు చెప్పాల్సిన పాఠ్యాంశాలపై నిర్దుష్టమైన ప్రణాళిక లేకపోడం ఘోరం! ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంశాలు, వక్రీకరణలు మారుతూ వుండడం మరో ఘోరం! మధ్య భారతంలోని చత్తీస్‌గఢ్‌లో హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో ‘దేశంలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం మహిళలు ’ అని వుంది. మహిళలు అన్ని రంగాల్లో విజృంభించడం వల్ల అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతూ వుండడం వల్ల పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని ప్రభుత్వం వారు నిర్ధారించారు. స్త్రీ, పురుషులందరూ దేశ పౌరులయినప్పుడు పౌరులకు సమాన హక్కులున్నప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పని చేయాలి. ఉద్యోగావకాశాలు కల్పించాలి.

అంతేగాని మహిళలు చదువుకొని ఉద్యోగాలకు పోటీ పడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అసంబద్ధంగా వుంది. స్త్రీలని గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతిమాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగ భాగమైన మహిళల్ని హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా వుంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బిజెపి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా లేదూ? ఇలాగైతే భవిష్యత్తంతా అంధకారమే కదా? అచ్ఛేదిన్ స్వచ్ఛభారత్ నినాదాల కింద ఎంత మురుగు పేరుకుపోతోందో ప్రజలు తెలుసుకోవాల్సి వుంది. ఒక్కటంటే ఒక్కటి ముందడుగు వేయకపోగా, దేశం వెయ్యడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా వుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ నిజాలు గ్రహించి, పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారికి హేతుబద్ధంగా ఆలోచించడం నేరాల్పి!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News