హెచ్సిఎ అధ్యక్షుడు అజహరుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నిబంధనలకు లోబడి ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ టోర్నమెంట్ను నిర్వహించే సత్తా హైదరాబాద్కు ఉందని హెచ్సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నాడు. వచ్చే ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్లోనూ మ్యాచ్లు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ బిసిసిఐకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనికి హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ మద్దతు తెలిపాడు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియం హైదరాబాద్లో ఉందన్నాడు. బయో సెక్యూర్ బుడగ ఏర్పాటు చేసి ఐపిఎల్ను విజయవంతంగా నిర్వహించే సత్తా తమ సంఘానికి ఉందన్నాడు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు దీటుగా హైదరాబాద్లో కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నాడు. ఇక్కడ ఐపిఎల్ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావన్నాడు. అంతేగాక దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే కరోనా తీవ్రత తక్కువ ఉన్న విషయాన్ని అజహరుద్దీన్ గుర్తు చేశాడు. ఐపిఎల్ నిర్వహణకు తమకు అనుమతి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం సహాయంతో దాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని అజహర్ హామీ ఇచ్చాడు.