Monday, April 29, 2024

విద్యుత్ సంస్థలపై ఐఎఎస్‌లకు అసూయ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆవిర్భావం తర్వాత విద్యుత్ రంగంలోని అన్ని విభాగాలలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉం దని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం మింట్ కంఫౌండ్‌లో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిర్మించిన తెలంగాణ విద్యుత్ ప్రభ భవన్‌ను సందర్భంగా అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సిఎండి ప్ర భాకర్‌రావు మాట్లాడారు. తెలంగాణ పితామహు డు, విద్యుత్ పితామహుడు ముఖ్యమంత్రి కెసిఆరేఅని అన్నారు. తెలంగాణ విద్యుత్ రంగం సాధిస్తున్న ప్రగతిని చూసి కొంత మంది ఐఎఎస్ అధికారులు సహించలేక పోతున్నారు. విద్యుత్ సంస్థల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నా నిధులను విడుదల చేయకుండా కొంత మంది అధికారులు రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఘాటుగా ఆరోపించారు.

ప్రభుత్వంలోని కొంత మంది అధికారులకు చేతులు జోడించి వేడుకుంటున్నా..ఈ విధానం ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడే అవకాశాలు వస్తాయన్నారు. ఇదే విషయంలో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదని,ఈ విషయం చెప్పినాక మమ్మల్ని పదవుల నుంచి తొలగించే కుట్ర కూడా జరగవచ్చని అయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని ఈ ఐఏఎస్ అధికారులు ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదని ముఖ్యమంత్రి మా పనితనం చూసి మాకు ఉద్యోగాలు ఇచ్చారని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఇది ఎవరిపైన ఫిర్యాదు కాదు, విమర్శలు కాదని, ఉన్నతాధికారులు సృష్టిస్తున్న ఆర్థిక సమస్యల వల్ల తాము పడుతున్న ఇబ్బందులతో విన్నపమే అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనంలో విద్యుత్ రంగం ప్రగతి పరుగులు పెడుతుండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నామన్నారు. రైతాంగానికి అవసరమైనంత విద్యుత్‌ను అందిస్తుమన్నారు.దేశంలో విద్యుత్ సగటు వినియోగం 1250 యూనిట్లు కాగా తెలంగాణ సగటు వినియోగం 2,126 యూనిట్లన్నారు.

కలెక్షన్లలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 99 శాతం వసూళ్లు అవుతున్నాయని , ఇది విద్యుత్ ఉద్యోగుల సమిష్టి కృషి వల్లనే సాధ్యం అయిందన్నారు. ప్రస్తుతం దేశంలో కరెంట్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, షెడ్యూల్‌లో అయినా, సరఫరాలో అయినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, తెలంగాణలో మాత్రమే కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నామని సిఎండి తెలిపారు. ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి మాట్లాడుతు వీఏవోఏటీ వారు మంచి భవనం నిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. అసోసియేషన్ విద్యుత్ అకౌంట్స్ అధికారుల హక్కుల కోసం పోరాడుతూనే సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సంస్థ బాగుంటేనే సంఘం బాగుంటుందని, సంఘం బాగుంటేనే సభ్యులు బాగుంటారనే విషయాన్ని గుర్తేరిగి ఎప్పటికప్పుడు అఫ్‌డెట్ కావాలన్నారు.

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతు ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు, ఎస్‌సిపిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డిల ఆశీస్సులతోనే భవనం పూర్తి చేయగలిగామని , పూర్తి సహాకారం అందించినందులకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు , ట్రాన్స్‌కో డైరెక్టర్లు జగత్‌రెడ్డి, ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్లు టి. శ్రీనివాస్, జే. శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్ మదన్‌మోహన్‌రావు, రాములు, స్వామిరెడ్డి, గోపాల్, సీజీఎంలు ఆనంద్, బిక్షపతి, మురళీకృష్ణ, ఎస్‌ఈలు వెంకన్న, మాదవరెడ్డి, మోహన్, విఏవోఏటీ ఉపాధ్యక్షులు నాజర్ షరీఫ్, వేణుబాబు, పరమేష్, వీరాస్వామి, వెంకటేశ్వర్లు, స్వామి, అనురాధ, అనీల్, టీఈఈఏ అధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్, రవి, నర్సింహారెడ్డి, టీఎస్‌పీఈఏ అధ్యక్షులు రత్నాకర్‌రావు, సెక్రటరీ జనరల్ సదానందం, గోపాలకృష్ణ, శివశంకర్, ముత్యం వెంకన్నగౌడ్, కుమారస్వామి, బానుప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News