మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రూ. 101 పైనే
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగవ రోజు చమురు ధరలు పెరగడంతో రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటగా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సైతం పెటోల్ ధర దాదాపు దానికి చేరువగా ఉంది. పశ్చిమ బెంగాల్తో సహా కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని దాదాపు 18 రోజుల పాటు చమురు ధరలు ఎటువంటి మార్పులకు లోనుకాలేదు. అయితే గడచిన నాలుగు రోజులుగా వరుసగా వాటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 31 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.27కు చేరుకోగా డీజిల్ ధర రూ. 81.73కు పెరిగింది.
తాజా పెంపుదలతో రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.15కు చేరుకుంది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.86కు పెరగగా మహారాష్ట్రలోని పర్భనిలో లీటర్ పెట్రోల్ రూ. 99.95 అంటే దాదాపు రూ. 100కు చేరుకోనున్నది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటడం ఈ ఏడాదిలో ఇది రెండవసారి. ఫిబ్రవరి మధ్యలో మొట్టమొదటిసారి లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటి చరిత్ర సృష్టించింది. గడచిన నాలుగు రోజులలో లీటర్ పెట్రోల్పై 88 పైసలు, డీజిల్పై 1 రూపాయి పెరుగుదల ఉంది.