Friday, April 26, 2024

ఈసారి పొరపాట్లకు తావుండదు.. 18న ఉప్పల్‌లో తొలి వన్డే..

- Advertisement -
- Advertisement -

కివీస్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు
ఈసారి పొరపాట్లకు తావుండదు
అందుబాటులోకి 29417 టికెట్లు
13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు
మ్యాచ్ రోజు ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు
14న న్యూజిలాండ్, 16న టీమిండియా జట్ల రాక
18న ఉప్పల్‌లో తొలి వన్డే
హెచ్‌సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే వన్డే మ్యాచ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజారుద్దీన్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వివరించారు. జనవరి 18న ఈ మ్యాచ్ జరుగుతుందన్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా జరిగిన పొరపాట్లను దృష్టిలో ఈసారి పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

టికెట్ల విక్రయాల్లో ఈసారి పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు. అభిమానుల కోసం 29417 టికెట్లను అందుబాటులోకి ఉంచామన్నారు. జనవరి 13 నుంచి నాలుగు రోజుల పాటు టికెట్లను అమ్మకాలు జరుగుతాయన్నారు. ఈసారి ఆన్‌లైన్‌లోనే (పెటిఎం) ద్వారా మాత్రమే టికెట్ల అమ్మకాలు ఉంటాయని, ఆఫ్‌లైన్‌లో విక్రయించే ప్రసక్తే లేదని అజారుద్దీన్ స్పష్టం చేశారు. తొలి రోజు ఆరు వేలు, రెండు, మూడు రోజుల్లో ఏడు వేల చొప్పున టికెట్ల అమ్మకం జరుగుతుందన్నారు.

ఇక మిగిలిన టికెట్లను జనవరి 16న విక్రయిస్తామన్నారు. ఇక ఆన్‌లైన్‌లో టికెట్లు ఖరారైన వారు జనవరి 15 నుంచి 18 వరకు నగరంలోని ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లను తీసుకోవాలని అజారుద్దీన్ సూచించారు. కాగా, టికెట్లను బ్లాక్‌లో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసారి పార్కింగ్ సమస్య తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాచ్ జరిగే రోజు మెట్రో రైళ్లు రాత్రి ఒంటి గంట వరకు నడుస్తాయమన్నారు. దీని కోసం ఇప్పటికే మెట్రో అధికారులతో చర్చించామన్నారు. కాగా, మ్యాచ్‌లో ఎప్పటిలాగే భారీ భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. రాచకొండ పోలీసుల సహకారంతో మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

14న కివీస్ జట్టు రాక
మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ టీమ్ ఈనెల 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. ఆతిథ్య టీమిండియా జనవరి 16న వస్తుందన్నారు. 15న సాయంత్రం న్యూజిలాండ్ టీమ్ సాధన ఉంటుందన్నారు. ఇక జనవరి 18న (బుధవారం) ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారభమవుతుందని, ఇది డే/నైట్ ఫార్మాట్‌లో ఉంటుందని అజారుద్దీన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News