Friday, May 3, 2024

జర్నలిస్టు తులసి చందు ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే : కూనంనేని సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వంతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్, ప్రాణహాని దాడుల బెదిరింపులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండిచారు. ఇది ఫాసిస్టు దోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. తమ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, శక్తులపై దాడి చేయడం బిజెపి అధికారంలోకి వచ్చాక పరిపాటిగా మారిందని విమర్శించారు. గతంలో సల్మాన్ రష్మీ,అరుందతి రాయ్, తస్లీమానస్రీన్ తదితరులపైన ఇదే పద్ధతులలో మతశక్తులు వారి భావాలను అంగీకరించనటువంటి కొన్ని ముస్లీం ఉగ్రవాద సంస్థలు, ఇతర సంస్థలు ఫత్వా తదితర పద్ధతుల ద్వారా వారి ప్రాణాలు తీయడానికి పిలుపివ్వడం జరిగిందని అన్నారు.

అదే విధంగా కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరి లంఖేష్, దబోల్కర్ తదితర మేధావులు, సామాజిక ఉద్యమకారులను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ మతోన్మాద మూకలే హత్యచేసినటువంటి ఘటనలు మరచిపోకముందే ఆ దాడుల పరంపర కొనసాగింపే ఈనాటి తులసి చందుపై ప్రాణహాని, బెదిరింపులు. ఆమెకు అన్నివిధాల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి హాని జరిగినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సివుంటుందని అన్నారు. సామాజిక ఉద్యమకారులు, హేతువాదులు, లౌకికవాదులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు తదితర ప్రశ్నించేవారిని, సత్యశోధన చేసేవారిని సమాజమేలు కోరేవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపైన ఉన్నదని కూనంనేని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News