అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణ
వాషింగ్టన్: కొవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలపై భారత్, రష్యా, చైనా సరైన లెక్కలు చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్తో ఆయన మొదటిసారి చర్చలో మంగళవారం పాల్గొన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో భారత్, రష్యా, చైనా వాయు కాలుష్యానికి ప్రధాన కారకులని కూడా ఆరోపించారు.
కరోనా వైరస్ కట్టడిలో తమ పనితీరు చాలా మెరుగ్గా ఉందని, ఎక్కువ టెస్టింగులు చేయడం వల్లే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెబుతూ ట్రంప్ తరచు భారత్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం తీవ్రతను చైనా దాచిపెడుతోందని కూడా ఆయన గతంలో ఆరోపించారు. అయితే కరోనా మరణాలను భారత్ కూడా తక్కువ చూపెడుతోందని ఆయన ఆరోపించడం మాత్రం ఇదే మొదటిసారి.
కొవిడ్-19 కారణంగా చైనాలో ఎందరు మరణించారో, రష్యాలో ఎందరు మరణించారో, భారత్లో ఎందరు మరణించారో ఎవరికీ తెలియదని, ఈ దేశాలు సరైన లెక్కలు చూపడం లేదని బిడెన్తో జరిగిన చర్చలో ట్రంప్ ఆరోపించారు.
కాగా..జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన కొవిడ్-19 గణాంకాల ప్రకారం ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా మరణించారు. వీరిలో 2 లక్షల మంది అమెరికాలో, 97,497 మంది భారత్లో, 2,456 మంది రష్యాలో, 4,739 మంది చైనాలో మరణించారు.
గత ఏడాది డిసెంబర్లో కరోనా మహమ్మారి బయటపడిన చైనాలో మృతుల సంఖ్య అంత తక్కువగా ఉండడంపై ఇప్పటికే పలుదేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందని, ఇది లక్షణాలు లేకుండానే వ్యాప్తి చెందుతుందన్న విషయాలను చైనాప్రపంచానికి వెల్లడి చేయకపోవడంపై కూడా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.