ఓపెనర్గా పృథ్వీషా అరంగేట్రం
మిడిలార్డర్లో రానున్న కెఎల్ రాహుల్
కివీస్తో వన్డే సిరీస్పై కోహ్లీ వెల్లడి
హామిల్టన్: న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు ఉంటాయని జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఏడాది తర్వాత టీమిండియా సీనియర్ జట్టులోకి వచ్చిన పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగుతాడని, సూపర్ ఫామ్లో ఉన్న కెఎల్ రాహుల్ మిడిలార్డర్లో వస్తాడని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘గాయంలో అనూహ్యంగా రోహిత్ జట్టుకు దూరం కావడం దురదృష్టకరం. మ్యాచ్లో అతను ఎంత ప్రభావం చూపిస్తాడో అందరికీ తెలుసు.ప్రస్తుతం మాకు వన్డే సిరీస్లు ఎక్కువగా లేవు. రోహిత్ కోలుకోవడానికి ఇదే సరైన సమయం.
అయితే ఈ సిరీస్తో ఓపెనర్గా పృథ్వీషా అరంగేట్రం చేయనున్నాడు. కెఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. మిడిలార్డర్లో అతడు అలవాటు పడాలని భావిస్తున్నాం’ అని కోహ్లీ చెప్పాడు. కాగా వన్డేల్లో ఇటీవల ఆస్ట్రేలియాతో అద్భుతంగా పోరాడామని, తొలి మ్యాచ్లో ఓడినా సిరీస్ను 2 1తో కైవసం చేసుకోవడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నాడు.తమ ప్రణాళికలను అమలు చేస్తూ పాజిటివ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నామని చెప్పాడు. వన్డే సిరీస్లో కివీస్ గట్టి పోటీనిస్తుందని తెలుసునని,తాము ఫీల్డింగ్లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నాడు.
టి20సిరీస్లో ఫీల్డింగ్ పేలవంగా ఉన్నా సిరీస్ క్లీన్స్వీప్ చేశామని, అయితే వన్డేలలో అలా సాధ్యం కాదని, పరిస్థితులు మారిపోతుంటాయని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం తొలి వన్డేలో టీమిండియా కివీస్తో తలపడనుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. కెఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తాడని కోహ్లీ స్పష్టం చేసిన దృష్టా పృథ్వీషాతో కలిసి మయాంక్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది.
India vs New Zealand ODI Series 2020