హైదరాబాద్: గత రబీలో పెట్టుబడి సాయం ఇచ్చిన రైతులకే ఈ రబీలోనూ అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2018 రబీలో 49.03 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.4 వేల చొప్పున రూ.5244 కోట్లు జమ చేశారు. ఈసారి 47.49 లక్షల మంది రైతులకు రబీలో పెట్టుబడి సాయం చేయనున్నట్లు తెలిసింది. కొంతమంది రైతులు చనిపోవడం, కొందరు వ్యవసాయ భూమి మారడం వంటి కారణాలతో తగ్గినట్లు తెలిసింది.
తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం ప్రకారం పెట్టుబడి సాయం జమ చేస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.6150 కోట్లు ఈ రబీలో చెల్లించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రబీలో పెట్టుబడి సాయానికి ఇటీవల రూ.5100 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
2018 ఖరీఫ్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం విధితమే. రాష్ట్రంలో ఉన్న ప్రతీ రైతుకు, ఎంత భూమి ఉంటే అంత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ముందుగా 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాకు రూ.4 వేల చొప్పున చెల్లించారు. తొలిసారి చెక్కుల రూపంలో ఇవ్వగా, తరువాతి నుంచి నేరుగా రైతు ఖాతాలోకి సొమ్మును జమచేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నారు. మూడు విడతల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.15,958 కోట్లు రైతుబంధు కింద అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చింది.
2019 ఖరీఫ్లో ప్రభుత్వం నుంచి 44.92 లక్షల మంది రైతులకు 1.09 కోట్ల ఎకరాలకు రూ.5 వేల చొప్పున రూ.5456 కోట్లు రైతులకు ఇచ్చింది. ఇంకా రూ.1519 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఖరీఫ్ 2018లో 50.88 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున రూ.5257 కోట్లు, రబీలో 2018లో 1.31 కోట్ల ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.5244 కోట్లు అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చింది.