అబుదాబి : ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ సూపర్ ఓవర్లో హైదరాబాద్ను ఓడించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో కోల్కతా అద్భు త విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్లో లుకి ఫెర్గూసన్ అసాధారణ బౌలింగ్తో కోల్కతాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన సమద్ రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సమద్ను కూడా ఫెర్గూసన్ క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో హైదరాబాద్ మూడు పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచిం ది. దీన్ని దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ జోడీ వికెట్ నష్టపోకుండానే అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో కోల్కతా ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇక హైదరాబాద్ ఆరో ఓటమితో నాకౌట్ ఛాన్స్ను క్లిష్టంగా మార్చుకుంది. అసాధారణ బౌలింగ్తో హైదరాబాద్ను హడలెత్తించిన ఫెర్గూసన్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ కూడా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.
శుభారంభం లభించినా…
కాగా, ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్కు ఓపెనర్లు జానీ బైర్స్టో, కేన్ విలియమ్సన్ కళ్లు చెదిరే శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. విలియమ్సన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన విలియమ్సన్ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్స్తో 29 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ క్రమంలో 6.1ఓవర్లలోనే 57 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్(4)ను కూడా ఫెర్గూసన్ క్లీన్బౌల్డ్ చేశాడు. మరోవైపు ఏడు ఫోర్లతో 28 బంతుల్లో 36 పరుగులు చేసిన బైర్స్టోను వరుణ్ చక్రవర్తి వెనక్కి పంపాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన మనీష్ పాండే మరోసారి నిరాశ పరిచాడు.ఆరు పరుగులు మాత్రమే చేసి ఫెర్గూసన్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. విజయ్ శంకర్(7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అయితే కెప్టెన్డేవిడ్ వార్నర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. జట్టును గెలిపించేందుకు చివరి వరకు తీవ్రంగా కృషి చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 33 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ రెండు ఫోర్లు, సిక్స్తో 15 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. కాగా, ఆఖరి ఓవర్లలో హైదరాబాద్కు విజయం 18 పరుగులు అవసరం అయ్యా యి. అయితే రసెల్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతాను ఇయాన్ మోర్గాన్ (34), కార్తీక్ 29 (నాటౌట్) ఆదుకున్నారు. మిగతావారిలో గిల్ (36), త్రిపాఠి (23), నితీష్ రానా (29) పరుగులు సాధించారు.
IPL 2020: KKR Won Super Over Eliminator against SRH