Friday, April 26, 2024

నలుదిక్కులా ఐటి

- Advertisement -
- Advertisement -

IT parks in Uppal at Medchal district

 

తూర్పు హైదరాబాద్ (ఉప్పల్)కు మరిన్ని పరిశ్రమలు
30 వేల మందికి ఉపాధి అవకాశాలు
25 లక్షల చదరపు అడుగుల ఐటి ఆఫీస్ స్పేస్
త్వరలో హైదరాబాద్ గ్రిడ్ కార్యక్రమ మార్గదర్శకాలు
ఐటి అభివృద్ధి, వసతుల కల్పనపై మంత్రి కెటిఆర్ సమీక్ష
ఐదు కంపెనీలకు కన్వర్షన్ పత్రాలు అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కోసం నగరం న లు మూలలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ఐటి కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఉప్పల్‌లోని ఎన్‌ఎస్‌ఎల్‌ఐటి సెట్‌లో సమావేశం అయ్యారు. ఐటి, దాని అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీ సుకోవాల్సిన చర్యలపై మంత్రి కెటిఆర్ చర్చించారు. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఐటి కంపెనీలతో పాటు భవిష్యత్తులో రానున్న ఐటి కంపెనీల ఏర్పాటు వాటికి సంబంధించిన మార్గదర్శకాలపైన ఈ సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది.

 

 

 

అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటిని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమల అభివృద్ధి అన్ని మూలలా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐటి పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలి క వసతులను కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపైన సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామిక స్థలాలను ఐటి పార్కులుగా అభివృద్ధిచేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను 5 కంపెనీల ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ అందజేశారు. ఈ ఐదు కంపెనీలు సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఐటి పార్కులను లేదా కార్యాలయాలకి అవసరం అయినా ఆఫీస్ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తదర్వా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ఐటి పరిశ్రమ జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి చెందుతూ వస్తున్నదని మంత్రి కెటిఆర్ వివరించారు. హైదరాబాద్ పట్ట ణం నలువైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు ఐటి పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న గ్రిడ్ విధానంతో ఐటి పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళతాయన్న నమ్మకం తనకుందన్నారు. ఇప్పటికే ఇక్కడ మెట్రోరైల్ కారిడార్, శిల్పారామం, మూసి నది అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతుల పెరుగుతున్నాయని తెలిపారు. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వైపు, అంబర్ పేట్… రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్డు మౌలిక వసతులు మరింత పెరుగుతాయన్నారు.

ఇప్పటికే నగరం నలువైపులా ఐటి పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఎరో స్పేస్, మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల పరిశ్రమలు విసర్తించి ఉన్నాయన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళితే వారి స్థలాలను ఐటి రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈస్ట్ హైదరాబాద్ వైపు మరిన్ని ఐటి పరిశ్రమలు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సమాచార సంచికను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News