Monday, April 29, 2024

కెసిఆర్ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి చరిత్ర సృష్టించారు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరు ఏళ్లలో అరవై ఏళ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు, పర్యావరణ పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్య, వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని విమర్శించారు. అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని మండిపడ్డారు. అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ మటుమాయం చేశారని కొనియాడారు. సోమవారం ఉదయం యాదాద్రిభోనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన భూమి పుత్రులకు ఆయన పొడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, తుర్కపల్లి, నారాయణపురం మండలాలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 205 మంది లబ్ధిదారులకు 213 ఎకరాల భూమికి ఆయన పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గిరిజనులు, గోండులు, అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. పొడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతాంగానికి తక్షణమే రైతు బంధు పధకం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. పాలనలో అద్భుతాలు సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని ఆయన కొనియాడారు.

తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని జగదీష్ పేర్కొన్నారు. తద్వారా తండాలలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. 2001 నాటి పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని మెచ్చుకున్నారు. సాధించిన రాష్ట్రాన్ని ఈన గాసి కుక్కల పాలు చెయ్యకుండా ప్రజాదివేనలతో అధికారంలోకి వచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు ,త్రాగునీరు, కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్, కెసిఆర్ కిట్ లతో పాటు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి చరిత్ర సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఘనత దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్ది, ఇంచార్జ్ కలెక్టర్ దీపక్ తివారీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిసిపి రాజేశ్ చంద్ర, ఎస్ టి వెలిఫెర్ ఆఫీసర్ నాగిరెడ్డి, డిఎఫ్ఓ పద్మజ, ఆర్ డిఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News