Tuesday, April 30, 2024

“కమలం” లోకి కమల్‌నాథ్ వర్గం ఎమ్‌ఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీకి చేరుతున్న ‘కమల్ ’ విధేయ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు

భోపాల్ : సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌కు విధేయులైన దాదాపు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ఢిల్లీకి ఆదివారం చేరుకున్నారు. కమల్‌నాథ్ , ఆయన కుమారుడు ఎంపి, నకుల్‌నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరు ఢిల్లీకి చేరుకోవడం రాజకీయ పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల్లో ముగ్గురు చింద్వారా నియోజక వర్గానికి చెందిన వారు కాగా, మరో ముగ్గురు అదే రీజియన్‌కు చెందిన వారు. చింద్వారా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా కమల్‌నాథ్ ప్రాతినిధ్యం వహించారు.

ప్రస్తుతం అదే స్థానం నుంచి ఎమ్‌ఎల్‌గా ఉన్నారు. నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కమల్‌నాథ్‌ను అధిష్ఠానం తప్పించింది. కమల్‌నాథ్ విధేయుడైన , మాజీ మంత్రి లఖన్ ఘంగోరియా కూడా ఢిల్లీ శిబిరంలో ఉన్నారు. అలాగే కమల్ నాథ్ మరో విధేయుడు మాజీ మంత్రి దీపక్ సక్సేనా చింద్వారాలోని విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కమల్‌ను తప్పించడం ఆయనకు మనస్తాపం కలిగించిందని చెప్పారు. తమ నాయకుడికి అన్ని గౌరవాలు దక్కాలని తాము కోరుకుంటున్నామని, కమల్‌నాథ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామని చెప్పారు. మరో నేత, మాజీ మంత్రి విక్రమ్ వర్మ మాట్లాడుతూ కమల్‌నాథ్‌ను తాను అనుసరిస్తానన్నారు.

దాదాపు 23 మంది ఎమ్‌ఎల్‌ఎల మద్దతును కూడగట్టడానికి కమల్‌నాథ్ ప్రయత్నిస్తున్నారు. అలా అయితే పార్టీఫిరాయింపు నిబంధనల పరిధి లోకి రాబోమని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్‌ఎల్‌ఎల్లో కాంగ్రెస్‌కు 66 స్థానాలు ఉన్నాయి. వీరిలో మూడో వంతు మంది వేరే పార్టీకి వెళ్లినా, ఫిరాయింపుల చట్టం కిందకు రారని మధ్యప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ రాఖేష్ పాండే పిటిఐకు వెల్లడించారు. 2020 మార్చిలో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా , ఆయన విధేయ ఎమ్‌ఎల్‌ఎలు బీజేపీ లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. దాంతో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News