కంగనకు పరిహారం చెల్లించాలి
బోంబే హైకోర్టు ఆదేశం
ముంబయి: బాలీవుడ్ నటి కంగనారనౌత్కు చెందిన బంగ్లాను కూల్చివేయడం ద్వారా బృహన్ ముంబయి కార్పొరేషన్(బిఎంసి) చట్టాన్ని దుర్వినియోగం చేసిందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. జరిగిన నష్టానికి నటికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నష్టాన్ని అంచనా వేయడానికి నిర్మాణరంగ నిపుణుడిని ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు తెలిపింది. పౌరులపై అధికారులు తమ కండబలాన్ని ఉపయోగిస్తే సహించబోమని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ ఎస్జె కథవాలా, జస్టిస్ ఆర్ఐ చాగ్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలిచ్చింది.
అక్రమ కట్టడమని ఆరోపిస్తూ బిఎంసి అధికారులు సెప్టెంబర్ 9న ముంబయి పాలీహిల్లోని కంగనకు చెందిన బంగ్లాను కూల్చి వేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోనూ, బిఎంసిలోనూ అధికారంలో ఉన్న శివసేనను విమర్శించినందునే తనపై కక్ష కట్టినట్టు కంగన ఆరోపించారు. కంగనపై శివసేన ఎంపి సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తప్పు పట్టింది. హూందాగా వ్యవహరించాల్సిన ఎంపీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మందలించింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో సంయమనం పాటించాలని కంగనకు సూచించింది. ముంబయిలో భద్రత లేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్లా తయారైందని కంగన ఆ సందర్భంగా వ్యాఖ్యానించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.