Tuesday, April 30, 2024

మంత్రి చేతి పై కెసిఆర్ పేరు పచ్చ బొట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఉన్న అభిమానాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతి పై కెసిఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కృతజ్ఞతతో మంత్రి సత్యవతి రాథోడ్ గారి చేతిపై కేసీఆర్ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు. గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం చేతిపై చేరిన క్షణం అది, గిరిజన యోధుడు కొమురం భీమ్ సహచరుని వారసులతో మంత్రి సత్యవతి రాథోడ్ పచ్చబొట్టు వేయించుకున్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి బంజారహిల్స్ లోని రోడ్ నెం10లోని బంజారా భవన్, లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఆదివాసి, బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంస్కృతిక కార్యముక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. మంత్రికి స్టాల్స్ నిర్వాహకులు వాటి ప్రత్యేకతలను వివరిచారు. ఆ సమయంలోనే పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కెసిఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. పచ్చబొట్టు నొప్పితో కూడినదని చెప్పినా మంత్రి కెసిఆర్ పేరును వేయాలని పట్టుబట్టి నొప్పిని భరిస్తూ పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రి గారికి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి పేర్కొన్నారు. గిరిజన నృత్యాలన్నింటిని మంత్రి తిలకించారు. అంధ్ మనోరంజనం దండారి, గోండుల దండారి గుస్సాడి, పర్థాన్‌ల డెంసా, కోలామ్‌ల తప్పెట గుడుం దండారి, తోటీల కిక్రీ వాద్యం, కోయల కొమ్ము, లంబాదీల బిందెల నృత్యాలు ఆహుతులను ఆలరించాయి.

ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ వాల్యానాయక్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, జిసిసి జిఎం సీతారామ్ నాయక్, డా. పి. కళ్యాణ్ రెడ్డి, డా. వి. సముజ్వల, య్యూజియం క్యురేటర్ డా. డి. సత్యనారాయణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News