Saturday, April 27, 2024

త్వరలో కెసిఆర్ జిల్లాల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలలో పర్యటిస్తారని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు వెల్లడించారు. కెసిఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఫిబ్రవరిలో ప్రతిరోజు తెలంగాణ భవన్‌కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని, త్వరలోనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ కిట్లపై కెసిఆర్ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కెసిఆర్‌కు తొలగించలేరని అన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎంఎల్‌ఎలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, ముందు ముందు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందని వెల్లడించారు.కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని హరీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ కోసం రాజీనామాలు చేశాం తప్ప రాజీపడలేదు
తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీపడలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని మండిపడ్డారు. రైతు బంధు కూడా ఇంకా వేయలేదని ఆరోపించారు. ఇలా అయితే రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి చేసినప్పటికీ దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని ఆయన తెలిపారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివని హరీశ్‌రావు అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని అన్నారు. శాసనసభలో తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, తమ సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News