Saturday, April 27, 2024

శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాలను విజ‌యవంతం చేయాలి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: స‌మిష్టి కృషితో శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాలను విజ‌యవంతం చేయాలని టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆవిష్కరించారు.  టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్ పి అన్బురాజన్, జిల్లా యంత్రాంగంతో గురువారం ఒంటిమిట్టలో ఇఒ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. టిటిడి అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఇఒ వివరించారు.

మార్చి 30వ తేదీ శ్రీ రామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 3వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 4వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6న రథోత్సవము, ఏప్రిల్ 7న చక్రస్నానం, ఏప్రిల్ 8న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.

వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ
చికిత్స కేంద్రాలు, ఆర్టిసి బస్సులు, హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం విభాగాలు ఈ నెల 16వ తేదీలోపు తమ కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు.  అంతకుముందు టిటిడి ఇఒ వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ తో కలిసి కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News