Sunday, April 28, 2024

మహేందర్‌రెడ్డి అవినీతి చేస్తే.. ఎందుకు డిజిపిగా నియమించారు: కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిఎస్‌పిఎస్సీ చైర్మన్‌గా నియమించిన మహేందర్ రెడ్డి అవినీతిపరుడైతే బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనను డిజిపిగా ఎలా నియమించారో బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చెప్పాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, పలువురు అధికారులపై ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలకు దీటుగా సమాధానమిచ్చారు.

36 ఏళ్ళ పాటు వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ డిజిపి మహేందర్ రెడ్డిగారిని సీనియర్ అధికారి గుర్తించి టిఎస్ పిఎస్సీ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించిందని మంత్రి స్పష్టం చేశారు. నీమాదిరిగా లిక్కర్ స్కాం, టిఎస్ పిఎస్సీ ప్రశ్రాపత్రాలు లీక్ చేయలేదు కదా అని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని ధ్వంసం చేసి నిధులను మెదక్, గజ్వేల్, సిరిసిల్లలకు తరలించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి అవినీతి కేసులో వాటా కలిగిన బిఆర్‌ఎస్ నాయకులకు సింగరేణి అవినీతిలో ఎంత వాటా ముట్టిందో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కవితకు ఏనాడు లేదన్నారు.

సింగరేణిలో డిప్యుటేషన్లకు, బదిలీలకు కవిత ఎవరి దగ్గర ఎంత సొమ్ము వసూలు చేసిందో ఎవరిని అడిగినా చెబుతారని తేల్చి చెప్పారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా కార్యదక్షత కలిగిన రజనీకాంత్ రెడ్డిని నియమిస్తే కవిత ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు గత తొమ్మిదిన్నరేళ్ళ మీ పరిపాలనను తిరిగి చూసుకొని, విశ్లేషించుకొని మాట్లాడాలని హితవు పలికారు. తరచూ మీడియాలో ఉండాలనే కోరికతో కాంగ్రెస్ పార్టీ మీద అబద్దపు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి మరోసారి ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించింది.
మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ భగవద్గతగా భావించే మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నదని, ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామని, మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఇప్పటికే 7 వేల మంది నర్సుల నియామకాలను చేపట్టామని, సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు త్వరలో 15 వేల కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News