సుప్రీంకోర్టులో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ పిటిషన్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటు ప్రకారం అద్దె చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఉత్తరాఖండ్ హైకోర్టు తనకు పంపించిన నోటీసులను సవాలు చేస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీచేసిన నోటీసులపై స్టే విధించాలని తన పిటిషన్లో అభ్యర్థించిన కోష్యారీ రాష్ట్రపతి, గవర్నర్లపై చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 361లో పొందుపరిచిన నిబంధనలు ఒక సిట్టింగ్ గవర్నర్గా తనకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు నిర్దేశించిన అద్దె మార్కెట్ ప్రకారం హేతుబద్ధంగా లేదని, డెహ్రాడూన్లోని నివాస బంగళాకు అంత భారీ అద్దె అసమంజమని ఆయన పేర్కొన్నారు. తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నోటీసులు జారీచేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వకేట్ అమన్ సిన్హా గవర్నర్ కోష్యారీపై కోర్టు ధిక్కార ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టు ఉత్తర్వులను పాటించనందుకు కోష్యారీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు అర్ధేందు మౌలీ ప్రసాద్, ప్రవేశ్ ఠాకూర్ దాఖలు చేశారు.