హైదరాబాద్ : మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్అఫిషియో ఓటును చట్టం పరిధిలోనే వినియోగించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. సోమవారం ఆయన ప్రగతిభవన్లో మాట్లాడుతూ.. ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటింగ్ విధానంను తాము తీసుకురాలేదన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులు అనే చట్టాన్ని గత ప్రభుత్వాల పాలకులైన టిడిపి, కాంగ్రెస్ పార్టీలు తీసుకువచ్చినదేనని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. 1999లో అప్పటి టిడిపి ప్రభుత్వం.. ఎంఎల్ఏలకు ఎక్స్అఫిషియో ఓటు హక్కు కల్పించిందన్నారు.
2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎల్సిలకు ఎక్స్అఫిషియో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించిందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాన్ని తాము వినియోగించుకున్నామని తేల్చిచెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చట్టం కల్పించిన హక్కు అని, ఆ హక్కును తాము వినియోగించుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఉన్న చట్టం ప్రకారం ఎక్స్అఫిషియో సభ్యులకు ఓట్లు ఉన్నాయని, తామేం ఆ చట్టాన్ని మార్చలేదని వెల్లడించారు. రాజ్య సభ సభ్యులు ఎక్కడైనా ఓటేయవచ్చని, శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన ఎంఎల్సిలు కూడా ఎక్కడైనా ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆ చట్టం ప్రకారమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని ఆయన వివరించారు.