Tuesday, May 14, 2024

వార్డు ఆఫీసర్లు

- Advertisement -
- Advertisement -

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు 
ఇంజినీరింగ్ శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, సహాయకులుగా ముగ్గురు ఎస్‌ఇలు  
పురపాలికల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలి : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొదటి సారిగా వార్డుకు ఒక అధికారిని నియమించాలని తలపట్టింది. ఈ అధికారి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు నిర్వహించనున్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయి వరకు మరింత పకడ్భందిగా తీసుకపోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు ఉండేలా నిర్ణయం తీసుకుంది. అలాగే వారికి సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు ఎస్‌ఇలను నియమించాలన్న ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణాల్లో పౌర సేవలను మరింత వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసే ప్రక్రియపై ఆయన చర్చించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పురపాలకశాఖ అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న సిఎం ఆలోచనల మేరకు రూపొదించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారని మంత్రి అన్నారు.
పురపాలక చట్టం నిర్ధేశించిన పారిశుద్ధం, హారిత హారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ తర్వాత నగరాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్పూర్తితో ముందుకు పోయేందుకు వీలుకలుగుతుందన్నారు. వార్డు ఆఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఏర్పడుతుందన్నారు. తద్వారా పురపాలనా అంటే పౌరపాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

KTR Meeting with Municipal Officers at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News