Monday, April 29, 2024

రాజ్‌నాథ్ సింగ్‌తో కెటిఆర్ భేటీ: రక్షణ భూములు బదిలీకి విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఇక్కడ కలిశారు. తెలంగాణలో చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందచేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కెటిఆర్ కోరారు.

స్కైవాక్స్, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం హైదరాబాద్‌లోని రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన రక్షణ మంత్రిని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కెటిఆర్ దాదాపు ఏడాది తర్వాత దేశ రాజధానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కెటిఆర్ కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పురీలను కలుసుకుని తెలంగాణలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

ఢిల్లీలో మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణను ఆదుకోవాలని తాను గతంలో కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రగతికి మద్దతు కోసం గత తొమ్మిదేళ్లలో 15 నుంచి 20 సార్లు కేంద్ర రక్షణ మంత్రులను కలిశానని, స్కై కారిడార్ల నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీకి కూడా విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచే దేశంలో 44 శా౩తం ఉద్యోగాల సృష్టి జరుగుతోందని కెటిఆర్ వివరించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ మారిందని, ఫార్మా, ఐటి, బయోటెక్, ఏరోస్పేస్ రంగాలలో వేగంగా అభివృద్ధి చెంతుతోందని ఆయన చెప్పారు. శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీతో సమావేశమై శంషాబాద్ విమానాశ్రయాన్ని కలిపే మెట్రో ప్రాజెక్టు రెండవ దశ గురించి చర్చించనున్నట్లు కెటిఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News