Monday, April 29, 2024

సహజీవనం దెబ్బతీసే రోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సహజీవన బంధం అత్యంత ప్రమాదకర రోగం, కాటేసే సర్పం అని బిజెపి ఎంపి ధరంవీర్ సింగ్ గురువారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. వైవాహిక బంధం లేకుండా కలిసి జీవించే ప్రక్రియ వల్ల తలెత్తుతున్న అనర్థాలను గుర్తించి వెంటనే వీటిని సమాజంలో నుంచి తొలిగించాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సహజజీవన నిషేధానికి చట్టం తీసుకురావల్సి ఉందని హర్యానాకు చెందిన ఈ ఎంపి డిమాండ్ చేశారు. సామాజికంగా ఈ సహజీవన పరిణామం ఎంతకు కోలుకోలేని స్థాయి దెబ్బను తీసే జబ్బు అవుతోందని, సామాజిక విలువలకు ఇది భంగకరం అవుతోందన్నారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ ఎంపి ఈ విషయం ప్రస్తావించారు. సామాజికంగా తలెత్తుతున్న కొన్ని పరిణామాలు భారతీయ విలువలను దెబ్బతీస్తున్నాయని, ఇవి భవిష్య తరాలకు ముప్పు తెచ్చిపెడుతాయని హెచ్చరించారు.

ప్రేమవివాహాలను తాము కాదనడం లేదని, అయితే ఇటువంటి పెళ్లిళ్లలోనే ఎక్కువగా విడాకులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇది తీవ్రస్థాయి విషయం అన్నారు. సరైన చట్టం ద్వారా సామాజిక రుగ్మతలకు కళ్లెం వేయాల్సి ఉందన్నారు. పెళ్లిళ్లు ఎటువంటివి అయినా వాటికి ముందు వధూవరుల తల్లిదండ్రుల నుంచి అనుమతి తప్పనిసరి చేయాల్సి ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం వసుధైక కుటుంబం పాలసీని పాటిస్తోంది. సహోదరత్వాన్ని చాటుతోంది. ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో వెర్రితలలు వేసే పద్ధతులు అక్కడ పాతవే కావచ్చు. అయితే భారతీయ సాంప్రదాయాలకు , విలువలకు ఇవి అనుగుణంగా ఉండవని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం , ఇతర విలువలకు కట్టుబడి భారతదేశం వ్యవహరిస్తుంది. దీనికి భంగకరంగా ఉండే ఎటువంటి వైఖరి అయినా ఆదిలోనే అంతం కావల్సి ఉంటుందని భివానీ మహేందర్ గఢ్‌కు చెందిన ఈ ఎంపి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News