Sunday, April 28, 2024

అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?

- Advertisement -
- Advertisement -

ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో దేశ అత్యున్నత అవార్డు పొందడానికి అద్వానీ చేసిందేమీ కనిపించడం లేదు. రథయాత్ర ద్వారా బిజెపి ఎదుగుదలకు పునాది వేయబట్టే ఆయనకీ అవార్డు దక్కింది. అయోధ్య రామమందిరం లో విగ్రహ ప్రతిష్టాపనకు అద్వానీని దూరంగా పెట్టినప్పటికీ, ఆయన అలగకుండా ఉంటానికి ‘భారత రత్న’ అనే తాయిలం ఇచ్చారు. ఈ ప్రభుత్వం పదేళ్ళుపూర్తి చేసుకున్న సందర్భంగా అద్వానీకి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా తమ రాజకీయ, సామాజిక విలువలను ప్రదర్శించింది. పురాతన ఆలోచనల మీద నిర్మించిన రామాలయమే వారి విజయోత్సవాలకు మూలం. ఈ అవార్డుకు అద్వానీని ఎంపిక చేయడం ద్వారా జాతి సమైక్యతకు దూరంగా ఉన్నామనే సందేశాన్ని ప్రభుత్వం పంపిస్తోంది. ప్రజల్ని విభజించి రగిలించిన విద్వేషాన్ని కొనసాగించడంగా ఈ విజయోత్సవం గుర్తించింది. దేశాన్ని ‘హిందూత్వీకరించడం, హిందూత్వాన్ని సైనికీకరించడం’ అనేది వి.డి. సావర్కార్ కోరుకున్న రాజకీయాలు.

బహుళత్వ స్వభావం గల భారత జాతీయ వాదానికి వ్యతిరేకంగా 1990 సెప్టెంబర్ ఒకటవ తేదీన అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా చెలరేగిన హింసలో 564 మంది మరణించడం ఒక దారుణమైతే, భారత రాజకీయాల్లో మతం కలిసిపోవడం అంతకంటే దారుణమైంది. భారత దేశాన్ని ‘హిందూత్వ దేశం’గా మార్చడం ద్వారా ముస్లిం వ్యతిరేక దేశం గా హిందూత్వాన్ని పునర్నిర్వచించడమనేది అద్వానీ ప్రచార ఉద్దేశం. ప్రజలను 500 సంవత్సరాల పూర్వకాలంలోనే స్థిరంగా ఉంచేసి, శతాబ్దాల పురాతనమైన మసీదును కూల్చేసి, రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలనేది మోడీ ఉద్దేశం. ‘మండల్’ (సామాజిక న్యాయం) కోసం కర్పూరీ ఠాకూర్‌కు, ‘కమండల్’ (హిందుత్వ) కోసం అద్వానీకి భారత రత్న ఇచ్చినట్టు బిజెపి భావిస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఈ ఇద్దరికీ ఒకేసారి భారత రత్న ఇవ్వడం వెనుక వేరే ఉద్దేశం ఉంది. మండల్ కమిషన్ సిఫార్సులను నాటి ప్రధాని వి.పి. సింగ్ ఆమోదించడంతో 1990లో అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. ఇతర వెనుకబడిన తరగతుల వారికి (ఒబిసిలకు) 27% రిజర్వేషన్లను కల్పిస్తూ బి.పి. మండల్ సమర్పించిన నివేదికను నాటి ప్రధాని వి.పి. సింగ్ ఆమోదించారు.

దానికి ప్రతిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బైట నుంచి మద్దతు తెలుపుతున్న బిజెపి నాయకుడు అద్వానీ రథయాత్రను ప్రారంభించారు.కులం హిందుత్వ భ్రమలను దెబ్బతీసింది. మతానికి భిన్నంగా లోతైన న్యాయం జరగాలనే స్పృహను మండల్ కమిషన్ కలిగించింది. హిందూత్వ సామాజిక క్రమపద్ధతికి మండల కమిషన్ తెచ్చిన సామాజిక న్యాయం ఒక పెద్ద సవాలుగా తయారైంది. హిందూత్వం చెప్పే సామరస్యానికి భిన్నంగా మండల్ కమిషన్ సమానత్వాన్ని కోరింది. మండల్ కమిషన్‌కు భిన్నంగా దేశవ్యాప్తంగా అద్వానీ చేపట్టిన రథయాత్ర హిందూత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందనే ప్రశ్నను లేవనెత్తింది. ఆ రెండూ పరస్పర వ్యతిరేకమైనవి.కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఎందుకు ఇస్తున్నారో ప్రకటించలేదు. మతానికి, విశ్వాసాలకు, లింగ భేదానికి అతీతంగా వెనుకబాటు తనాన్ని లెక్కించడానికి మారు పేరుగా కర్పూరి ఠాకూర్ పేరు నిలబడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి 27%, పూర్తిగా వెనుకబడిన వారికి 12%, చదువుకున్న మహిళలకు, పేద మహిళలకు 3% చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. పాట్నా గాంధీ మైదానంలో 46 ఏళ్ళ క్రితం 1978 నవంబర్ 26వ తేదీన దీపావళి రోజు సాయంత్రం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న కర్పూరీ ఠాకూర్ మొరార్జీని కోపంగా చూశారు.

ప్రధాని మొరార్జీ దేశాయ్ వెంటనే ఢిల్లీ వెళ్ళి, సచివాలయంలో రాత్రి 8.30 కి అట్టడుగు వర్గాల వారికి 26% రిజర్వేషన్లు కల్పించే కర్పూరీ ఠాకూర్ ఫార్ములాను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. జెంషెడ్ పూర్‌లో శ్రీరామనవమి సందర్భంగా 1979 ఏప్రిల్‌లో జరిగిన మత ఘర్షణల్లో వంద మంది మృతి చెందారు. దీనికి హిందూ తీవ్రవాదులే కారణమని, ఈ అల్లర్లను ఆర్‌ఎస్‌ఎస్ పురికొల్పిందని ‘ఇండియా టుడే’ 1979 మేలో రాసింది. ‘ఈ అల్లర్లకు ప్రాథమికంగా ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ ఎంఎల్‌ఎ దీనానాథ్ పాండే బాధ్యులు’ అని జస్టిస్ జితేంద్ర నారాయణ్ కమిషన్ తేల్చింది. జనతా పార్టీలో ఉన్న జనసంఘ్ శక్తుల వల్ల ఇబ్బందిపడిన కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వం కొన్ని నెలలు మాత్రమే కొనసాగ గలిగింది. కర్పూరీ ఠాకూర్ విధానం వల్ల ఏర్పడిన సామాజిక న్యాయం తమ దీర్ఘకాలిక ధ్యేయానికి అడ్డుతగులుతోందని సంఫ్‌ు పరివార్ భావించింది.ముస్లింలకు న్యాయం చేయడానికి ఆర్‌జెడి, జెడి(యు) సంకీర్ణ ప్రభుత్వం గతంలో చేపట్టిన కులగణనపై బీహార్ బిజెపి చేపట్టిన వాదనలను గమనిస్తే మండల్, కమండల్‌వి భిన్నభావాలని స్పష్టమవుతోంది. ముస్లింలలో వెనుకబడిన పాస్పండ తరగతికి చెందిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది. ఒబిసిలకు 43% రిజర్వేషన్లు కల్పించడం వల్ల దారిద్య్రరేఖకు దిగువనున్న షేర్‌షాబ్ది దునియా వర్గానికి చెందిన ముస్లింలు లబ్ధి పొందుతారు.

వెనుకబడిన ముస్లింలను దూరంగా పెట్టడానికే హిందూత్వ శక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వెనుకబడిన ముస్లింలతో సమానంగా వెనుకబడిన ఇతర విశ్వాసాలు గల వారికి కూడా రిజర్వేషన్లు చేకూరుతున్నాయి. ఉత్తర భారతదేశాన్ని మండల్ కమిషన్ ఒక కుదుపు కుదుపుతున్నప్పుడు కర్నాటక, కేరళలలో వెనుకబడిన ముస్లిలంను గుర్తించారు. ముస్లింలలో వెనుకబడిన వారికి ఉన్న 4% రిజర్వేషన్లను బిజెపి నాయకత్వంలోని బొమ్మై ప్రభుత్వం రద్దు చేసింది. ఎల్.జి. హవనూర్ ఆధ్వర్యంలో కర్నాటకలో ఏర్పడిన వెనుకబడిన తరగతుల కమిషన్ చేసిన సిఫార్సులను 1972లో దేవరాజ్ అర్స్ ప్రభుత్వం ఆమోదించింది. కొన్ని కులాలవారు అధికారాన్ని అనుభవించడానికి ఈ మార్పు దోహదం చేసింది. మండల్ కమిషన్ కంటే ముందు వెనుకబడిన వారిని అంచనా వేయడానికి ఈ కమిషన్ నివేదిక దోహదం చేసింది. గత నవంబర్ చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాష్ర్టంలో మేం అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను తీసేస్తాం అన్నారు. నిజానికి ఇది ముస్లింల రిజరేషన్లు కావు, ముస్లింలలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి కల్పించే రిజర్వేషన్లు. విశ్వాసాలతో సంబంధం లేకుండా వెనుకబడిన తరగతుల వారికి కల్పించే సదుపాయం.

వెనుకబడిని ముస్లిలంను రిజర్వేషన్ల నుంచి బైటికి తీసుకొస్తామని బిజెపి చెప్పడమంటే మండల్ కమిషన్ ధ్యేయానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. హిందువులకు, మైనారిటీలకు, ముస్లింలకు మధ్య సరిహద్దు రేఖగీయడమే కమండల్ ఉద్దేశం. మండల్‌కు విలువ ఇచ్చినట్టయితే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం, సాధికారికత కల్పించడంతో అది కమండలానికి వ్యతిరేకమవుతుంది. కర్పూరి ఠాకూర్ దగ్గరకు వచ్చేసరికి మండల్ కమిషన్ నివేదికను, దాని ఉద్యేశాన్ని తిరస్కరించి, దాని పేరును మాత్రం ఉపయోగించుకుంటున్నారు. ఒబిసిలను నాలుగు విభాగాలుగా చేయాలని ప్రతిపాదించిన రోహిణీ కమిషన్ నివేదికను 14 వాయిదాల తరువాత గత ఏడాది సమర్పించినప్పటికీ దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఆశలేమీ లేవు. దీన్ని ఆధారం చేసుకుని ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒబిసిలను విభజిస్తూ రాఘవేంద్ర కుమార్ కమిషన్ 2018లో నివేదికను సమర్పించింది. మోడీ చెప్పినట్టు తెలంగాణలో దళితులను ఉప విభాగాలుగా విభజించాలని బిజెపి భావించడం ఆశ్చర్యకరంగా ఉంది. మౌలికంగా, బలహీనంగా ఉన్న ఇతర కులాల వారి దేవతలకు కూడా చోటు కల్పించడం ద్వారా సర్వదేవతా రాధన కూడా కమండలంలో భాగమైపోయింది.

ఇక్కడ కూడా ఆధిపత్య హిందూత్వ విధానాన్ని అమలు పరచడమే. హర్యానాలో గత ఏడాది రాజ్‌మిహిర్ భోజన్ విగ్రహం పెట్టిన సందర్భంగా గుజ్జర్‌లకు, రాజ్‌పుత్రులకు మధ్య ఘర్షణ జరిగింది. హిందూత్వం మండల్ సృష్టికర్తలను కూడా మింగేస్తుంది. హిందుత్వ గొడుగు కింద ఉన్న అతి చిన్న కులవర్గం కూడా మండల కమిషన్‌ను వ్యతిరేకించింది. మండల్‌ను, కమండల్‌ను కలపడం కాదు. కమండలం మండల్‌ను మింగేస్తోంది. ఉప కులాలుగా విభజించడం అనేది హిందుత్వ శక్తులకు ఉపయోగపడుతోంది. అతి చిన్న చిన్న కులాలవారు ఒకరితో ఒకరు కలహించుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి యాదవులను, దళితులను మినహాయించి ఒబిసిలను బహిరంగంగానే కలుపుకుపోతోంది. ఒబిసిలు ఒక బలమైన శక్తిగా, సవాలుగా తయారవుతోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం బిజెపి చిన్న చిన్న కులాలను కలుస్తున్నప్పటికీ మండల ధ్యేయాలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఆ పని చేస్తోంది.భారత దేశంలో నరకప్రాయంగా ఉన్న కుల వ్యవస్థ వంటి సామాజిక పరిస్థితులను మార్చకుండా, వెనుకబడిన వారి ఓట్ల కోసం మండల కమిషన్ రాలేదు.

మనం 2024లో ఉన్నట్టయితే, 1950లో వచ్చిన రాజ్యాంగాన్ని తిరస్కరించిన హిందూ జాతీయ వాదం రాజకీయాధికారాన్ని అనుభవిస్తోంది. అఫ్ఘానిస్తాన్‌లోని బొమియాన్ బుద్ధ విగ్రహాలను 2001లో తాలిబాన్లు ధ్వంసం చేయడానికి తొమ్మిదేళ్ళ ముందు 1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేయడానికి ఈ ఆధిపత్యవాదమే భారత దేశంలో తలెత్తింది. అద్వానీ రథయాత్ర మనం ఎక్కడున్నామో మన మూలాలను తెలియ చెప్పింది. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించినప్పుడు మండల్, కమండల్ ఎందుకు మిళితం కాలేదనేది మంచి పాఠం. మండల్ మండలమే, కమండలం కమండలమే. ఈ రెండు కలవని దిక్కులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News