Monday, April 29, 2024

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు- ఒక సమీక్ష

- Advertisement -
- Advertisement -

ఇటీవల అడ్వొకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి? ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని నోటీసులు సైతం జారీ చేసింది. ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు వర్తింపచేయకపోవడం పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపినట్లే. కాబట్టి ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలు తీరు మరొక్కసారి చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక ప్రమాణాల ఆధారంగా అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లను కల్పించడం కోసం ఉన్నత విద్యలో 15(6), ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో16(6) ఆర్టికల్స్‌ను చేరుస్తూ 9 జనవరి 2019న భారత పార్లమెంటు 103 రాజ్యాంగ సవరణ చట్టం, 2019ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం 12 జనవరి 2019న రాష్ట్రపతి ఆమోదం పొంది అదే రోజు గెజిట్‌లో ప్రచురించబడింది. 27 సెప్టెంబర్ 2022న బెంచ్ అన్ని పక్షాల వాదనలను ముగించి తీర్పును రిజర్వు చేసింది. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయని 3:2 విభజనలో బెంచ్ 7 నవంబర్ 2022 న తీర్పును వెలువరించింది.

2019లో ప్రతిపాదించబడ్డ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు 2022 తుది తీర్పు తర్వాత అమలులోనికి వచ్చాయి. ప్రతిపాదనకు ముందు గానీ, మధ్యలో గానీ, ఆ తర్వాత గానీ అగ్రవర్ణాలలోని పేదలను గుర్తించడానికి ఎలాంటి శాస్త్రీయమైన కసరత్తు జరగలేదు. కానీ ఒబిసిలను గుర్తించడానికి మాత్రం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరిగింది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులను గుర్తించేందుకు గాను శాస్త్రీయ అధ్యయనానికి శ్రీకారం చుట్టబడింది. 1953లో ఏర్పరిచిన కాకా కాలేల్కర్ కమిషన్ సంప్రదాయ కులసోపాన క్రమంలో తక్కువ సామాజిక స్థానంతో పాటు సాధారణ విద్యా పురోగతి లేకపోవడం, వాణిజ్యం, పరిశ్రమల రంగం లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, అసురక్షిత భూములను కలిగి ఉండడం, సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి వాటిని ప్రమాణాలుగా పరిగణనలోనికి తీసుకున్నది.

1979లో ఏర్పరచిన బిపి మండల్ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్యపరంగా మరింత లోతైన అధ్యయనం చేసి వారు చేపట్టిన వృత్తులను, పాఠశాలలో పిల్లల నమోదు స్థాయిని, స్త్రీల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకొని వాటికి సూచికలను రూపొందించింది. 2399 వెనకబడ్డ కులాలు, 837 అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయని, సమాజంలో వారి జనాభా 52% ఉన్నదని అదే అనుపాతంలో రిజర్వేషన్‌ను కల్పించాలని కమిషన్ ప్రతిపాదించింది. అయితే 1992 లో ఇందిరా సాహ్నీ కేసులో ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు 50% దాటకుండా ఉండేలా ఒబిసిలకు 27% రిజర్వేషన్‌ను ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

విద్య, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్ కోటానే రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఉదాహరణకు కేంద్రం ఎస్‌టి రిజర్వేషన్ 7.5% ఇస్తుండగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో4%, బీహార్, ఉత్తర ప్రదేశ్, కేరళలో 2% చొప్పున, తమిళనాడులో 1% గా, ఈశాన్య రాష్ట్రాలలో 80%, లక్షదీప్‌లో 100%గా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 15% ఎస్‌సిలకు రిజర్వేషన్ కల్పిస్తుండగా తమిళనాడులో 18%, గోవాలో 2%, సిక్కిం, గుజరాత్‌లలో 7%, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో 16% చొప్పున అమలు చేస్తున్నారు.

అంటే ఆయా రాష్ట్రాలలో జనాభాను బట్టి వారికి రిజర్వేషన్లను కల్పిస్తున్నారన్న మాట. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను 10% వరకు అమలు చేయవచ్చు అని 15 (6), 16 (6) ఆర్టికల్స్ స్పష్టంగా పేర్కొంటున్నాయంటే కచ్చితంగా 10% కాదనే విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాలి. రాష్ట్రాలలో ఉన్న జనాభాను బట్టి రిజర్వేషన్ వాటా కల్పించాలి. అగ్రవర్ణాల జనాభా దక్షిణ భారతదేశంలో 10% కంటే తక్కువగాను, ఉత్తర భారత దేశంలో 20% కంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ తెలిపారు. ఇడబ్ల్యుఎస్ వారిని గుర్తించడానికి ప్రత్యేక సర్వే ఏమీ చేయలేదని నీతి ఆయోగ్ అందించిన రిపోర్ట్ ప్రకారం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కింద దేశ వ్యాప్తంగా ఇడబ్ల్యుఎస్ వారు 18.2% ఉన్నారని రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్రం నివేదించింది.

అట్లే తెలంగాణ ప్రభుత్వం 2014 లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ముస్లిం జనాభాను మినహాయిస్తే ఒసిలు 9.4% కాగా, ఎస్‌సిలు 17%, ఎస్‌టిలు 9.6%, బిసిలు 52% ఉండగా ముస్లిం బిసిలను కూడా కలుపుకుంటే వీరి జనాభా వాటా మరింత పెరిగినట్లే. రాష్ట్రాలవారీగా కమ్యూనిటీ జనాభా వేరువేరుగా ఉంటున్నందున రిజర్వేషన్ వాటాని ఒకే రకంగా ఇవ్వడం సహేతుకం కాదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలలోని లొసుగులను ఆధారం చేసుకొని అధిక ఆదాయం ఉన్నప్పటికీ కొందరు దొడ్డిదారిన ఇడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లను తెచ్చుకొని ప్రభుత్వోద్యోగాలు పొందుతున్నారు. బిసిలవలే తమకు కూడా ఉద్యోగం నుండి వచ్చిన వేతనాన్ని, వ్యవసాయాదాయాన్ని మినహాయింపు చేసి ఇడబ్ల్యుఎస్ పరిధిలోకి తీసుకురావాలని అగ్రవర్ణాల్లోని మరికొందరు కోరుతున్నారు.

ఆగమేఘాలపై తెచ్చిన ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ను పునస్సమీక్షించి నిజమైన నిరుపేదలను గుర్తించడానికి ఒక కమిషన్‌ను వేసి శాస్త్రీయ అధ్యయనం చేసి జనాభా ఆధారంగా వారి వాటాను నిర్దేశించాలని, ఆర్థిక కోణంలో ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్లను ప్రత్యేక రిజర్వేషన్‌గా పేర్కొంటూ హారిజాంటల్ గా అమలు చేసి బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల వారిని కూడా ఈ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’కు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవని పలువురు న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ స్పందించి ఈ రిజర్వేషన్లను పునఃసమీక్షించి, సమగ్ర అధ్యయనం చేసి అందరికీ న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భాస్కర్ యలకంటి 8919464488

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News