మాలిక్కు ముంబయి పేలుళ్ల కేసుతో సంబంధాలు: ఫడ్నవిస్
ఫడ్నవిస్పై హైడ్రోజన్ బాంబు పేలుస్తా: నవాబ్ మాలిక్
ముంబయి: క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు,అనంతరం నాటినుంచి మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపుతో రోజుకో కొత్త కాంట్రవర్సీతో హాట్ హాట్గా మారుతున్నాయి. ఆర్యన్ జైలునుంచి బైటికి రావడం, ఎన్సిబి అధికారి సమీర్ వాంఖడే ఈ కేసు దర్యాప్తునుంచి తప్పుకోవడం… ఈ విషయంపై ఎన్సిపి, శివసేన, బిజెపి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వివాదానికి తెరలేపాయి. డ్రగ్స్ కేసు క్రమేణా రాజకీయ రంగు పులుముకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య యుద్ధానికి దారి తీసింది. తాజాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సిపి నేత , రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 1993 ముంబయి పేలుళ్ల కేసులు నవాబ్ మాలిక్కు ప్రమేయం ఉందంటూ ఫడ్నవిస్ ఆరోపించగా, తాను ఒక హైడ్రోజన్ బాంబు వేస్తే ఫడ్నవిస్ కుంభకోణాలన్నీ బయటపడతాయని మాలిక్ హెచ్చరిస్తున్నారు.‘ కుర్లాలోని గోవాల కాంపౌండ్లో ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ చాలా తక్కువ ధరకు భూమి కొనుగోలు చేశారు.
ముంబయి పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులనుంచి తప్పుడు ధ్రువ పత్రాలతో ఈ ఆస్తులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ముంబయిలో నేరస్థులయిన సర్దార్ శహ్వానీ ఖాన్, సలీమ్ పటేల్లతో యాలిక్కు సంబంధాలున్నాయని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్కు సలీమ్ ఇషాక్ పటేల్ ముఖ్య అనుచరుడుగా వ్యవహరిస్తున్నాడు’ అని మంగళవారం విలేఖరుల సమావేశంలో ఫడ్నవిస్ ఆరోపించారు. కాగా ఫడ్నవిస్ ఆరోపణలపై మాలిక్ అంతే ఘాటుగా స్పందించారు. ‘ సలీం పటేల్నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి. స్టాంప్ డ్యూటీకి చెల్లించిన రసీదులు కూడా ఉన్నాయి. కానీ ఫడ్నవిస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూస్తున్నారు. 62 ఏళ్ల నా జీవితం, 26 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు కూడా అండర్వరల్డ్తో సంబంధాలున్నాయని ఆరోపించలేదు. నేను ఒక్క హైడ్రోజన్ బాంబు వేస్తే ఫడ్నవిస్ కుంభకోణాలన్నీ బయట పడతాయి’ అని మాలిక్ అన్నారు. తన అల్లుడు సమీర్ ఖాన్పై చేసిన ఆరోపణలకుగాను తన కుమార్తె బుధవారం ఫడ్నవిస్కు లీగల్ నోటీసు పంపించనున్నట్లు కూడా మాలిక్ చెప్పారు.