రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా దేశంలో ఏర్పడిన తీవ్ర ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఒక ఘోర విషాదం ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోందని, రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించి అత్యవసర పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించాలని మనీష్ తివారీ సోమవారం అర్థించారు.
దేశంలో ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, ప్రతి చోట ఆసుపత్రులలో పడకలకు, మెడికల్ ఆక్సిజన్కు, ప్రాణాధార మందులకు, వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపికి చెందిన నీరో ఒకపక్క పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంటే దేశం మరోపక్క తగలబడిపోతోంది. వెంటనే రాష్ట్రపతి పార్లమెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి అంటూ ఆయన పరోక్షంగా ప్రధాని మోడీని దుయ్యబట్టారు. కరోనా వైరస్తో మరణించిన వారిని దహనం చేసేందుకు స్మశానవాటికలు సరిపోవడం లేదని, ఈ ఘోర పరిస్థితిని ఎదుర్కోనేందుకు ఒక జాతీయ విధానాన్ని పార్లమెంట్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని అంటూ మనీష్ ట్వీట్ చేశారు.