Saturday, April 27, 2024

హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోలేదని స్పష్టం చేశారు. హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న మావోయిస్టులు హిడ్మా సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు వైమానిక దాడులు చేశారని, గతేడాది ఏప్రిల్‌లోనూ బాంబు దాడికి పాల్ప డ్డారని ఆరోపించారు.

మావోయిస్టు పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బ తీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారని తెలిపిన మావోయిస్టులు రాత్రీ, పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టినట్లు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన మేరకు దాడులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పంట పొలాలకు వెళ్లలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
జరిగిందేంటి…!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజా పూర్ అడవుల్లో బుధవారం సిఆర్‌పిఎఫ్ దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కి కమాండర్‌గా ఉన్న హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందింది. దీనిపై పోలీసులు కానీ, మావోయిస్టు పార్టీ కానీ బుధవారం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎన్‌కౌంటర్ వార్తలపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. భద్రతాదళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. సవివరమైన సమాచారం త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు కీలక లేఖ విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News