సిద్దిపేట: ఇల్లు కూలి నిరాశ్రయులైన ఆడబిడ్డలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణి ఇల్లు కూలడంతో తల్లి, కూతురు స్రవంతి నిరాశ్రయులయ్యారు. 8ఏళ్ల కిందట తండ్రి రాజయ్య గుండెపోటుతో మరణించగా ఆర్థికంగా చితికిపోయి కొట్టుమిట్టాడుతున్నారు. ఇంట్లో పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్ల బర్లు, మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద దిక్కులేని కుటుంబానికి అన్నలా కూలిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు శనివారం జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధకృష్ణ శర్మతో కలిసి బాలమణి ఇంటి గృహ ప్రవేశం చేయించారు. తల్లీ కూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి మిఠాయి తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Minister Harish Rao help for homeless family