Tuesday, April 30, 2024

ప్రజలకు.. ప్రభుత్వానికి వారధులు.. పార్టీకి సారథులు యువతనే

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao meeting with TRS youth leaders

సిద్దిపేట: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టు కొమ్మలని, చిన్నకోడూర్ మండలం, గ్రామ స్థాయిలో యువజన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ సీనియర్లు, జూనియర్లతో కలసి కట్టుగా సమన్వయంతో వ్యవహరించాలని మండల పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, చిన్నకోడూర్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మండలంలో గ్రామ ప్రజాప్రతినిధులు, యువజన విభాగం నాయకులతో మండల పార్టీ బలోపేతం- సమాలోచనపై మంత్రి హరీశ్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నకోడూర్ మండలం, గ్రామాలలో యువజన విభాగం క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. పని చేయాల్సిన అవసరం, బాధ్యత పార్టీ బాధ్యులపై ఉన్నదని మంత్రి కోరారు. పార్టీ బలోపేతానికి పెద్దచిన్నా తేడాలేకుండా అందరూ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో విరివిగా ప్రచారం చేపట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నదని, ఎందుకు ఈ నిబంధనలు పెట్టిందనే విషయంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మా రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు బాయిలకాడ, బోర్లకాడ ఇస్తున్నట్లు, గత ఏడేండ్లుగా అందిస్తున్నట్లు, ఇందుకోసం యేటా 12 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, కానీ కేంద్ర బీజేపీ రైతుల ఉసురు పోసుకునేలా విద్యుత్తు సంస్కరణలు తేవాలని రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నదని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఒకప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని, కేవలం యేడాది ఇచ్చి యేటా 6 సార్లు 2400 వరకూ ఇచ్చినట్లే ఇచ్చి, ఇవాళ వెయ్యి 55 రూపాయలకు బీజేపీ దిగజారిందని, రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని, ఎరువుల ధరలు, యూరియా ధరలు పెంచిన విషయాన్ని తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధానాలు అవలంభించడం ద్వారా కేంద్రం ఆదుకోకపోయినా.. వివక్ష చూపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మనమంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని కోరారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతీ యేటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతుభీమా.. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఇతర ఏ రాష్ట్రాలలో అయినా ఇస్తున్నారా.. అంటూ ప్రజలకు తెలిసేలా వివరించాలని, బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే, బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని, రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంపు చేస్తోందని, కొనుగోలు తగ్గిస్తుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మీ క్రియాశీలక పాత్ర పోషించాలని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News