ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలి
వలస కార్మికులకు అండగా ఉంటాం
వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి,
ఓ బాలుడితో సరదా సంభాషణ
మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని, అందరూ ఇంట్లోనే ఉండాలని ఆయన ప్రజలను కోరారు. వేములవాడలో రెడ్ జోన్గా ప్రకటించిన సుభా ష్ నగర్ ఏరియాలో ఆయన పర్యటించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వల్ల భయడపుతున్నామని చెప్పిన ఓ వృద్ధురాలికి కెటిఆర్ ధైర్యం చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి కెటిఆర్ ఆరా తీశారు. సుభాష్ నగర్ ఏరియాలో ఆరో తరగతి చదువుతున్న కుర్రాడిని కరోనాను ఏం చేద్దాం.. అని మంత్రి అడగడంతో కుర్రాడు స్పందిస్తూ ‘ఖతం చేద్దాం’ అన్నాడు. కాసేపు వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ప్రజలు మాస్కులు ధరించాలని మంత్రి చెప్పారు. రెడ్ జోన్ ఏరియాలో వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులు చిత్తశుద్ధితో పని చేయడాన్ని ఆయన అభినందించారు.
ముందస్తు చర్యలతో రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువ
ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.. బుధవారం సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న వైనం చరిత్రలో ఇదే మొదటి సారి కావొచ్చని ఆయన అభిప్రాయపడారు. కరోనాకు మందులేదని, వ్యాధి బారిన పడకుండా ముందస్తు చర్య లు తీసుకోవడమే నివారణోపాయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే అమెరికా, స్పెయిన్, ఇటలీ, యుకె వంటి దేశాలు కరోనా నివారణకు భారత్ అనుసరిస్తున్న విధానాలవైపు దృష్టి సారిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్లాంటి అత్యధిక జనాభా కల దేశంలో కరోనా వంటి మహమ్మారిని ఎదిరించడం కష్టతరమైన పనే అయినప్పటికీ, ఈ వైరస్ను అరికట్టడంలో సత్ఫలితాలు సాధిస్తున్నామని ఆయన చెప్పారు.
లాక్డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా, కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ త్రిముఖ వ్యూహంతో కరోనా వ్యాధి రాకుండా ముందు కు సాగుతున్నారని కెటిఆర్ తెలిపారు. భౌతిక దూరం పాటించడం, పేదలకు ఆహర సమస్యలు రాకుండా చూడటం, అన్ని రకాల వైద్య సేవలకు సిద్ధపడి ఉండటమనే త్రిముఖ వ్యూహంతో కరోనాను ఎదుర్కొంటున్నామన్నారు. తెలంగాణలో లాక్డౌన్ పక్కాగా అమలవుతోందన్నారు. ఇండియన్ మెడికల్ రీసెర్చి వారు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అభినందించారని ఆయన పేర్కొన్నారు.లాక్డౌన్ ప్రకటించక పోతే లక్షల సంఖ్యలో కరోనా వ్యాధి బారిన పడేవారన్నారు.
ప్రస్తుతం వేల సంఖ్యలోనే కేసులు ఉండటానికి ప్రభుత్వాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణమన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి దాదాపుగా బయట పడే సమయంలో డిల్లీ తబ్లిగీజమాత్కు వెళ్లివచ్చిన 1200 మంది వల్ల సమస్య వచ్చి పడిందని ఆయన చెప్పారు. కరోనా కేసుల్లో 70 శాతం తబ్లిగీ జమాత్ వల్ల వచ్చినవేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి, కలెక్టర్ దేవరకొండ కృష్ఫభాస్కర్, ఎస్పి రాహుల్హెగ్డె, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపార వేత్తలు కరోనా సహాయనిధి కింద చెక్కుల రూపంలో విరాళాలు మంత్రి కెటిఆర్కు అందించారు.